Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాళ్లకు గుడ్న్యూస్.. ఇక నుంచి బిల్లులు సకాలంలో..
రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు

Midday Meal Scheme
Telangana: రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 25,941 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుంది. సుమారు 18.19 లక్షల మంది విద్యార్థులకు భోజనం అందుతుంది. ఈ స్కీమ్ కోసం ప్రతినెలా సుమారు రూ.50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ పథకం అమలవుతుంది.
ప్రస్తుతం మధ్యాహ్న భోజనం కార్మికులకు బిల్లులు చెల్లించడంలో చాలా ఆలస్యమవుతుంది. ఒక్కోసారి రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నిధులు మ్యాచింగ్ గ్రాంట్స్ రిలీజ్ చేయకపోతే ఏకంగా ఐదారు నెలలపాటు బిల్స్ క్లియర్ కావడం లేదు. దీంతో ఏజెన్సీలు అప్పులుచేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న పరిస్థితి. ఈ పథకం కింద ఫస్ట్ క్లాస్ నుంచి 8వ తరగతి వరకు అయ్యే ఖర్చులో 60శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు అందిస్తుంది. ఇక 9, 10 తరగతులకు అయ్యే ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.
మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ఆరు, ఏడు రకాల బిల్లులు వేర్వేరుగా వస్తుంటాయి. ప్రధానంగా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, 9, 10 క్లాస్ లకు సపరేట్ గా ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుంది. దీనికితోడు ఎగ్స్ బిల్లు, మిడ్ డే మీల్స్ కార్మికుల జీతాలు, విద్యార్థులకు కులాల వారీగా బిల్లులు వేర్వేరుగా వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినెలా బిల్స్ ను ఫైనాన్స్ కు పంపిస్తే, వారంతా రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం వాటాలకు అనుగుణంగా బిల్స్ రిలీజ్ చేస్తుంటారు. ఈ ప్రాసెస్ కు టైమ్ ఎక్కువగా పడుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు నేరుగా స్టేట్ సెంటర్ నుంచి డబ్బులు ఏజెన్సీ నిర్వాహకుల ఖాతాల్లో పడేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇది ఎలా అమలు చేయాలన్నదానిపై భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాల్లోని ఒక్కో మండలంలో తెలంగాణ ఆన్ లైన్ తో కలిసి విద్యాశాఖ అధికారులు అధ్యయనం చేయనున్నారు. 10రోజుల్లోనే ఆయా జిల్లాల కలెక్టర్లకు నివేదిక ఇవ్వనున్నారు. ఈ విధానం సబబేనని ప్రభుత్వం భావిస్తే.. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే అన్ని జిల్లాల్లో ఈ విధానాన్ని అమలుచేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.