Private Hospital : కోవిడ్ సంక్షోభకాలంలో కాసుల కోసం పీడించుకు తింటున్న ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ సర్కార్ కొరడా ఝళిపిస్తోంది. ఫిర్యాదు రావడం ఆలస్యం సదరు ఆసుపత్రి దోపిడీపై నిఘా పెడుతోంది. దగాకోరు ఆసుపత్రులకు నోటీసులిస్తోంది. ఆధారాలతో సహా నిరూపితమైతే.. కోవిడ్ చికిత్సకు అనుమతులను రద్దు చేస్తోంది.
కోవిడ్ చికిత్సకు అనుమతులు పొందిన ప్రైవేట్ ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ఇదే అదనుగా దందాకు తెరదీశాయి పలు ఆసుపత్రులు. లక్షలు రూపాయిలు వసూలు చేసి మృతదేహాలను అప్పగిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాకంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై చర్యలకు రోగుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సీరియస్గా స్పందిస్తోంది.
కరోనా కాలంలో మానవతా దృక్పథంతో చికిత్స అందించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోయేసరికి కొరడా ఝులిపిస్తున్నారు అధికారులు. మొన్న 64 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ ప్రజారోగ్య విభాగం..నిన్న మరో 15 ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చింది. శుక్రవారం 5 ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సకు అనుమతులు రద్దు చేసిన ప్రభుత్వం…శనివారం మరో 5 ఆసుపత్రులను కరోనా చికిత్స అనుమతులు రద్దు చేసింది.
కోవిడ్ చికిత్స అనుమతులు రద్దయిన ఆసుపత్రుల్లో మూడు హైదరాబాద్లోనే ఉన్నాయి. అమీర్పేటలోని ఇమేజ్, ఎల్బీనగర్లో అంకురా, కొండాపూర్లోని సియా లైఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్లోని సాయిలైఫ్ ఆసుపత్రి, సంగారెడ్డి షాపూర్నగర్లో సాయి సిద్ధార్థ ఆసుపత్రిని ఇదే లిస్ట్లో చేర్చింది ప్రభుత్వం.
అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని మొత్తం 115 ఫిర్యాదులు అందాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న వైద్య ఆరోగ్య శాఖ.. మొత్తం 79 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. మొత్తం ఆసుపత్రులకు కోవిడ్ చికిత్స అనుమతులు రద్దుచేసింది. బిల్లింగ్లో అవకతవకలు, బెడ్ ఆక్యుపెన్సీ, వ్యాక్సినేషన్పై వచ్చిన ఫిర్యాదులతో పలు ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ…24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
కొత్తగా కోవిడ్ రోగులను చేర్చుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆసుపత్రులో ఉన్నవారికి ప్రొటోకాల్ ప్రకారం చికిత్స అందించాలని సూచించింది. ఈ ఆదేశాలను అమలు చేయకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి యాజమాన్యాలను హెచ్చరించింది. ఆస్పత్రి లైసెన్సులను రద్దు చేయక తప్పదని వైద్యారోగ్య శాఖ హెచ్చరించింది.