హైదరాబాద్‌ నడిబొడ్డు నుంచి ఎక్స్‌ప్రెస్‌ వే.. వాహనదారులు రయ్‌మంటూ వెళ్లిపోయేలా..

ఐటీ కారిడార్‌ నుంచి సిటీ మధ్యలోకి వచ్చే రోడ్లు, కేబీఆర్‌ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి.

హైదరాబాద్‌ నడిబొడ్డు నుంచి ఎక్స్‌ప్రెస్‌ వే.. వాహనదారులు రయ్‌మంటూ వెళ్లిపోయేలా..

Hyderabad

Updated On : December 3, 2025 / 11:53 AM IST

Hyderabad: హైదరాబాద్‌-సైబరాబాద్‌ను అనుసంధానించేలా, ఔటర్‌ రింగ్‌రోడ్డుకు వాహనదారులు వేగంగా చేరుకునేలా కొత్త ఎక్స్‌ప్రెస్‌ వేను నిర్మించాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో హైదరాబాద్‌లోని ట్రాఫిక్‌ సమస్యలు మరింత తగ్గనున్నాయి.

ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ఎంతో మేలు జరగనుంది. ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందించాలని హెచ్‌ఎండీఏను తెలంగాణ సర్కారు ఆదేశించింది. (Hyderabad)

బంజారాహిల్స్‌ రోడ్డు నం.12 నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లే అవుట్‌ వరకు 10 కి.మీ మేర 6 లైన్ల ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించే అవకాశం ఉంది. దీనిపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. మెహదీపట్నం టు శంషాబాద్‌ విమానాశ్రయం వరకు చేపట్టిన పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేలాగే ఇప్పుడు కొత్త దాన్ని నిర్మించాలని అనుకుంటున్నారు.

Also Read: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ వచ్చేస్తోంది.. ఆ రోజే ప్రకటన..!

హైదరాబాద్‌లో పెరిగిన జనాభాకు తగ్గట్లుగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోడ్ల విస్తరణతో పాటు ఫ్లై ఓవర్లు, అండర్‌ పాస్‌లను నిర్మించారు. అయినప్పటికీ ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలు ఉన్నాయి. ఐటీ కారిడార్‌ నుంచి సిటీ మధ్యలోకి వచ్చే రోడ్లు, కేబీఆర్‌ పార్కు చుట్టూ ఉన్న రోడ్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి.

దీంతో కొత్త ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించాలన్న ప్రతిపాదన వచ్చింది. ఓఆర్‌ఆర్‌ నుంచి సిటీ మధ్యలోకి రాకపోకలకు ఈ ఎక్స్‌ప్రెస్‌ వే వీలు ఇస్తుంది. 6-7 కి.మీ మేర 6 వరుసల స్టీల్‌ బ్రిడ్జి, పలు ప్రాంతాల్లో అండర్‌ పాస్‌లను నిర్మించాలని భావిస్తున్నారు.

దీంతో వాహనాలు ఆటంకాలు లేకుండా వేగంగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సర్వే బాధ్యతలను ప్రభుత్వం ఓ కన్సల్టెన్సీకి అప్పగించింది. ఇప్పటికే ఆ సంస్థ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తోంది.