Global Summit 2025 : గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం.. 50 కంపెనీలు.. 3లక్షల కోట్ల పెట్టుబడులు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

Global Summit 2025 : భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కోసం సర్వం సిద్ధమైంది. ఈ నెల 8, 9 తేదీల్లో ఈ సమ్మిట్ జరగనుంది.

Global Summit 2025 : గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం.. 50 కంపెనీలు.. 3లక్షల కోట్ల పెట్టుబడులు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

Global Summit 2025

Updated On : December 7, 2025 / 8:47 AM IST

Global Summit 2025 : భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కోసం సర్వం సిద్ధమైంది. ఈ నెల 8, 9 తేదీల్లో ఈ సమ్మిట్ జరగనుంది. సమ్మిట్ కోసం మొత్తం ఆరు ఖండాలకు చెందిన 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు వస్తున్నారు. 8వ తేదీన మధ్యాహ్నం 1.30గంటల సమయంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సమ్మిట్ ను ప్రారంభిస్తారు. 9వ తేదీ సాయంత్రం 6గంటలకు సమ్మిట్ ముగుస్తుంది. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మూడు ట్రిలియన్ డాలర్ల స్థాయికి పెంచాలనే లక్ష్యంతో ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

Also Read: Virat Kohli : సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం.. విరాట్ కోహ్లీ కీలక కామెంట్స్.. రోహిత్, నేను ముందే అనుకున్నాం..

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం 500 ఎకరాల్లో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 2వేల మంది కూర్చునేలా ప్రారంభ వేదికను సిద్ధం చేశారు. ప్యానల్ చర్చల కోసం ఆరు సెషన్ హాళ్లు సిద్ధం చేశారు. సీఎం, ప్రముఖుల కోసం ఎంఐపీ హాల్ ఏర్పాటు చేశారు. వివిధ పథకాల ప్రదర్శనకు వీడియో టన్నెల్ సిద్ధం చేశారు.

అంతేకాక.. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాల వివరాలను ఆడియో వీడియో (ఏవీ) తెరల (స్క్రీన్లు)పై ప్రదర్శించనున్నారు. చారిత్రక, ఆధునిక ప్రాధాన్యమున్న భవనాల ఆకృతులను, నమూనాలను కూడా ప్రత్యేకంగా స్టాళ్లలో ఏర్పాటు చేస్తారు. ఈ నిమిత్తం మొత్తం 35 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు.

తెలంగాణ రైజింగ్ సమ్మిలో పారిశ్రామిక పెట్టుబడుల ఒప్పందాల విలువ రూ.3లక్షల కోట్లకు చేరింది. సుమారు 50 ప్రతిష్టాత్మక సంస్థలు, పలు రంగాల్లో ఈ మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకోనున్నాయి. ఈ ఒప్పందాలకు సంబంధించిన ప్రకటనలన్నీ కూడా తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సందర్భంగా వెలువడనున్నాయి. ఇప్పటికే 14 కంపెనీలు.. లక్ష కోట్ల పెట్టుబడులపై ప్రభుత్వంతో అవగాహన ఏర్పర్చుకున్నాయి.


భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కోసం జరుగుతున్న ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ప్రాంగణంలోకి వెళ్లి వేదికలు, ఇతర నిర్మాణ పనులన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. సదుపాయాల్లో ఎలాంటి లోటు రావొద్దని ఆదేశించారు.

సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. మూసీ పునరుజ్జీవనంపై ఏర్పాటు చేసిన డిజిటల్ చిత్రాలను సీఎం పరిశీలించారు. అతిథులకు కల్పించే సదుపాయాలు, ఇంటర్ నెట్, వాహనాల రాకపోకలకు రహదారులు, సాంస్కృతిక కార్యక్రమాలు, భోజన వసతి, అగ్నిప్రమాదాల నివారణకు ఏర్పాట్లు గురించి అధికారులను అడిగి సీఎం రేవంత్ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు.

అంత‌ర్జాతీయ కంపెనీల‌కు చెందిన ప్ర‌తినిధులు, కేంద్ర మంత్రులు, ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, మంత్రులు, వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు స‌మ్మిట్‌కు హాజ‌ర‌వుతున్నందున వారికి స్వాగ‌త ఏర్పాట్లు, వ‌స‌తి, ఇత‌ర స‌దుపాయాల విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు.