Telangana Theatres: ఓటీటీ రాజ్యమేలితే సినిమాలకే రిస్క్.. నష్టపోయేది నిర్మాతలే!
చిత్ర పరిశ్రమలో ఓటీటీలు కారణంగా రాబోయే రోజుల్లో సినిమా థియేటర్స్ మూత పడే అవకాశాలు ఉన్నాయంటూ థియేటర్స్ ఓనర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Theatres
Telangana Theatre Owners Association: చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఓటీటీ రాజ్యమేలుతోంది. ఓటీటీలు కారణంగా రాబోయే రోజుల్లో సినిమా థియేటర్స్ మూత పడే అవకాశాలు ఉన్నాయంటూ థియేటర్స్ ఓనర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓటీటీలకు అడ్డుకట్ట వెయ్యకపోతే సినీపరిశ్రమ ఇబ్బందులు పడే అవకాశం ఉందని, థియేటర్స్ని నమ్ముకున్న ఎన్నో కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో తెలంగాణా థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది.
ఈ సంధర్భంగా నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. “NTR, ANR లేకపోయినా వాళ్ళ సినిమాలు అడిన థియేటర్స్ ఇప్పటికీ ఉన్నాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మధ్య అవినాభావ సంబంధం వుంది. థియేటర్స్లో సినిమా విడుదలైతే నిర్మాతల దగ్గర నుండి పోస్టర్స్ వేసే బాయ్స్, కూల్ డ్రింక్స్, సమోసాలు అమ్మే వర్కర్స్ వరకు ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది.
సినిమాని థియేటర్లో చూసిన అనుభూతి ఓటిటీలో రాదు.. నిర్మాతలకు నా విజ్ఞప్తి ఏమిటంటే మీ సినిమాలను ఓటీటీల్లో కాకుండా థియేటర్స్లో విడుదల చేయండి. తప్పని పరిస్థితుల్లో ఓటీటీల్లో విడుదల చేయాల్సి వస్తే, ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలను థియేటర్స్లో విడుదల చేసిన కొన్ని రోజుల గ్యాప్ తర్వాత విడుదల చెయ్యండి.” అని విజ్ఞప్తి చేశారు.
అనంతరం సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. “సెప్టెంబర్ 10న లవ్ స్టొరీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తే అదే రోజు టక్ జగదీష్ ఓటీటీలో విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. ఇది కరెక్ట్ కాదు. లాక్ డౌన్ కారణంగా చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఇబ్బంది పడతారని మేము ప్రెస్ మీట్ పెట్టి సినీ నిర్మాతలందరూ కూడా థియేటర్స్ వ్యవస్థను బతికించాలని కోరుతూ మీరు థియేటర్స్ లో సినిమాలు విడుదల చేస్తే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఓటీటీలో విడుదల చేయాలనుకుంటే మాత్రం మూడు నెలలు వరకు ఆగి ఆ తర్వాత మీ సినిమాలను ఓటీటీల్లో విడుదల చేయాలని రిక్వెస్ట్ చేశాము.
అయినా కూడా వారు ఆగకుండా మేము థియేటర్స్లో సినిమాను విడుదల చేస్తున్న డేట్ కే “టక్ జగదీశ్ ” సినిమాను విడుదల చేస్తున్నారు. ఓటీటీల్లో విడుదలయ్యే టక్ జగదీశ్ సినిమా డేట్ పోస్ట్ ఫోన్ చేసుకోమని నిర్మాతలతో మాట్లాడాము. వాళ్ళు అమెజాన్ వాళ్ళతో మాట్లాడతామన్నారు. కానీ పూర్తి భరోసా ఇవ్వలేదు. నిర్మాతలందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి పండుగల సమయంలో పెద్ద సినిమాలని ఓటీటీల్లో విడుదల చేయొద్దు.
మేమంతా ప్రేక్షకులను థియేటర్స్కు తీసుకు రావాలని ప్రయత్నం చేస్తుంటే మీరు ఓటీటీల్లో సినిమాలను రిలీజ్ చేసి ప్రేక్షకులను థియేటర్స్కు రాకుండా చేస్తున్నారు. ఇది సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు.. దీనివల్ల ఎక్కువగా నష్టపోయేది నిర్మాతలే. ఈ సమస్యను చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్లాము చిరంజీవి గారు కూడా మాట్లాడతానని అన్నారు.” అంటూ చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు సినీ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొని ఓటీటీ వద్దు థియేటర్స్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్, సెక్రెటరీ సునిల్ నారంగ్, థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ సెక్రెటరీ విజయేందర్ రెడ్డి, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, జెమిని కిరణ్, జాయింట్ సెక్రటరీ బాల గోవింద్ రాజ్, టీఎఫ్సీసీ మెంబర్ అనుపమ్ రెడ్డి,మరియు సినిమా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్, సెక్రెటరీ సునిల్ నారంగ్, థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ సెక్రెటరీ విజయేందర్ రెడ్డి, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, జెమిని కిరణ్, జాయింట్ సెక్రటరీ బాల గోవింద్రాజ్, టీఎఫ్సీసీ మెంబర్ అనుపమ్ రెడ్డి మరియు సినిమా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొన్నారు.