Weather Updates: సూర్యుడి వేడి సెగల మధ్య చల్లని కబురు.. వానలు వచ్చేస్తున్నాయ్..
పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం...
వేడి సెగలు కక్కుతున్న సూర్యుడు ప్రజలను ఇంట్లోంచి బయట కాలు పెట్టనివ్వట్లేదు. బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు జనాలు. ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ ఓ గుడ్న్యూస్ చెప్పింది. రానున్న ఐదురోజులపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయింది. కొన్ని జిల్లాల్లో వడగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు చెప్పింది.
ఇవాళ కొత్తగూడెంతో పాటు సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉంది. అలాగే, భూపాలపల్లి, ములుగుతో పాటు కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.
పలు ప్రాంతాల్లో నేటి నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోనూ మంగళవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.
Also Read: పోషకాల వరి వంగడాలు.. డయాబెటిక్ దూరం చేసే వరి రకాలు