TPCC vice-president Mallu Ravi
Mallu Ravi Comments : యాదగిరి గుట్టలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందంటూ బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి విమర్శించారు. సోమవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. దళితులను ఎలా గౌరవించాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసునన్నారు.
కాంగ్రెస్ పార్టీ దళితులకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన విషయం అందరికి తెలుసనని చెప్పారు. బీఆర్ఎస్ దళితులను, దళిత నాయకులను ఎలా అవమానించిందో అందరికి తెలుసునని మల్లు రవి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Read Also : BRS New Strategy : పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి బీఆర్ఎస్ సరికొత్త వ్యూహం.. కారణం అదేనా?
భట్టిని డిప్యూటీ సీఎం చేసింది కాంగ్రెస్ పార్టీనే :
గత బీఆర్ఎస్ పాలనలో భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే.. సీఎల్పీ విలీనం అంటూ కొత్త కథ అల్లి భట్టి విక్రమార్కకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు ఆయనకు అవమానం అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మండిపడ్డారు.
దళిత ముఖ్యమంత్రి అంటూ ప్రగల్బాలు పలికి దళితులను మోసం చేసిన బీఆర్ఎస్ ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరు నమ్మారని అన్నారు. భట్టి విక్రమార్కకు ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేని మల్లు రవి స్పష్టం చేశారు.
Mallu Ravi – Mallu Batti Vikramarka
పక్కన కూర్చొబెట్టడంపై మల్లు రవి వివరణ :
యాదగిరిగుట్టలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన నల్గొండ జిల్లా మంత్రులను కూర్చొబెట్టారని, మిగతా మంత్రులను మరో పక్కన కూర్చోబెట్టారని, భద్రాచలంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని పక్కనే కూర్చోబెట్టారని మల్లు రవి వివరణ ఇచ్చారు.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు చాలా సఖ్యతతో, సమన్వయంతో ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీలో జరిగే అంశాలపై మాట్లాడాల్సిన అవసరం లేదని మల్లు రవి బీఆర్ఎస్ నేతలకు చురకలంటించారు.
Read Also : Bjp Focus On Telangana : టార్గెట్ 17.. తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్, రంగంలోకి అగ్రనేతలు