Tetired Employees: రిటైర్డ్ అధికారుల లెక్క తేలింది.. త్వరలోనే వారందరికీ..
పదవీ విరమణ చేసిన అధికారులకు జీతభత్యాల రూపంలో నెలకు 150 కోట్ల చొప్పున తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా, ఏడాదికి 1,800 కోట్లు చెల్లిస్తూ వస్తోంది.

CM Revanth Reddy
తెలంగాణ ప్రభుత్వంలో ఇకపై రిటైర్డ్ అధికారులకు కాలం చెల్లినట్టేనా..? ఇక నుంచి పదవీ విరమణ చేసిన అధికారులకు సర్కార్లో పనిచేసే చాన్స్ లేనట్టేనా..? అంటే అవునే అంటున్నాయి తాజా పరిణామాలు. తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారుల లెక్క తేలడంతో.. త్వరలోనే వారందరికి ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైంది. ఇక నుంచి ప్రత్యేక పరిస్థితుల్లో తప్పా.. రిటైరైన అధికారులను విధుల్లోకి తీసుకోవద్దన్న నిర్ణయంతో రేవంత్ సర్కార్ ముందుకెళ్తోంది.
తెలంగాణ ప్రభుత్వంలోని పలు శాఖల్లో రిటైరైన అధికారులు రీ అపాయింట్మెంట్, ఎక్స్టెన్షన్ పేరుతో ఇంకా విధులు నిర్వహిస్తున్న వారి లెక్క తేలింది. సీఎస్ శాంతి కుమారి ఆదేశంతో… ఆయా శాఖల కార్యదర్శులు నివేదికలు సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో కలిపి మొత్తం 1,049 మంది రిటైర్డ్ అధికారులు విధులు నిర్వహిస్తున్నట్లు నివేదికల ద్వారా తేలింది.
ఈ నివేదికను సీఎస్ శాంతి కుమారి విదేశీ పర్యటన నుంచి రాగానే సీఎం రేవంత్రెడ్డికి అందజేయనున్నారు. రిటైరైన అధికారులు ప్రభుత్వంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా గ్రూప్ వన్ ఆఫీసర్లు, ఐఏఎస్, ఐఎఫ్ఎస్, కన్ఫర్డ్ ఐఏఎస్లతో పాటు ఇతర రిటైర్డ్ అధికారులు కూడా ఉన్నట్లు గుర్తించారు.
తెలంగాణలో మున్సిపల్ శాఖలోనే అత్యధికంగా 179 మంది రిటైర్డ్ అధికారులు ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఉన్నత విద్యాశాఖలో 88 మంది, పౌరసరఫరాల శాఖలో 75 మంది, రోడ్లు భవనాల శాఖలో 81 మంది, ఇరిగేషన్ శాఖలో 70 మంది, పంచాయతీరాజ్లో 48 రిటైర్డ్ అధికారులు ఉద్యోగాల్లో కొనసాగుతున్నట్టు లెక్క తేలింది.
వీరంతా రిటైర్ అయినప్పటికీ బీఆర్ఎస్ సర్కార్ రెండుసార్లు కన్సలెంట్లుగా, సలహాదారులుగా, ఈఎన్సీలుగా కొనసాగారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులు చాలా సంవత్సరాల క్రితమే రిటైర్ అయినప్పటికీ వారిని తిరిగి ఉన్నత పోస్టుల్లో కూర్చోబెట్టింది కేసీఆర్ సర్కార్. వీరిలో చాలా మంది టర్మ్ ఎప్పటి వరకు అనేది స్పష్టం చేయకుండా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతారని అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని ఉత్తర్వులు ఇచ్చారు.
రిటైరైన అయిన అధికారుల్లో ఐదుగురు ఐఏఎస్లు సైతం ఉన్నారు. సెక్రటేరియేట్లో ప్రోటోకాల్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తిస్తున్న అర్విందర్ సింగ్, ఎండోమెంట్ కమీషనర్ అనీల్ కుమార్, పశుసంవర్ధక శాఖలో స్పెషల్ సీఎస్గా అధర్ సిన్హా, లేబర్ డిపార్ట్మెంట్లో స్పెషల్ సీఎస్గా రాణి కుముదిని, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉమర్ జలీల్ ఉన్నారు. ఇలా రిటైర్డ్ అయిన అధికారులకు లక్షల్లో జీతాలు చెల్లించడంతో పాటు వెహికల్, ఆఫీసు, అదనపు సిబ్బంది ఇలా అన్ని సౌకర్యాలు కేటాయించడంతో సర్కారుపై కోట్ల రూపాయల భారం పడింది.
పదవీ విరమణ చేసిన అధికారులకు జీతభత్యాల రూపంలో నెలకు 150 కోట్ల చొప్పున తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా, ఏడాదికి 1,800 కోట్లు చెల్లిస్తూ వస్తోంది. అంటే బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి ఉన్న ఈ పదేళ్లలో రిటైర్డైన అధికారుల జీతభత్యాల కోసం సుమారు 13 వేల కోట్లు చెల్లించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే సీఎం రేవంత్రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి రాగానే… వీరి తొలగింపుపై ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
TSPSC: టీఎస్పీఎస్సీ కొత్త టీమ్ కోసం సర్కార్ కసరత్తు.. నిరుద్యోగుల కోసం.. ఏం జరుగుతుందో తెలుసా?