Ys Sharmila Nirahara Deeksha : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు ఖమ్మం జిల్లా పెనుబల్లిలో నిరుద్యోగ నిరసన నిరాహార దీక్ష చేపట్టారు. కష్టపడి చదివినా ఉద్యోగం రాలేదనే ఆవేదనతో గంగదేవిపాడు మండలానికి చెందిన నిరుద్యోగి సానిక నాగేశ్వరరావు ఇటీవల పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
మొదట గ్రామానికి చేరుకున్న ఆమె నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. షర్మిల ముందు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధ పడవద్దని… మనో ధైర్యాన్ని కోల్పోవద్దని….కుటుంబానికి అండగా ఉంటానని షర్మిల హామీ ఇచ్చారు.
అనంతరం పెనుబల్లిలో చేపట్టిన నిరాహార దీక్షలో షర్మిల పాల్గొన్నారు. నిరాహార దీక్షకు కూర్చునే ముందు ఆమె దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి దీక్షకు కూర్చున్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణమని షర్మిల ఆరోపించారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవటంతో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.