RDOను బెదిరించిన కానిస్టేబుల్: తహశీల్దార్ విజయారెడ్డికి పట్టిన గతే పడుతుంది

భూ వివాదాలు మనుషుల ప్రాణాల్ని తీస్తున్నాయి. హత్యలకు పురిగొల్పుతున్నాయి. బెదిరింపులకు దిగేలా చేస్తున్నాయి. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసు ఘటన మరచిపోక ముందే మరో రెవెన్యూ అధికారిపై కానిస్టేబుల్ బెదిరింపులకు దిగాడు. కామారెడ్డి ఆర్డీవో రాజేంద్ర కుమార్ కు కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు.
తాడ్వాయి మండలంలోని సోమారంలోని 9.12 ఎకరాల భూమికి సంబంధించి గత కొద్ది రోజులుగా ఆర్డీవో రాజేంద్ర కుమార్ ను కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి బెదిరిస్తున్నాడు. శ్రీనివాస్ రెడ్డి తండ్రి అమ్మివేసిన సదరు భూమికి సంబంధించి పాస్ పుస్తకం తన పేరునే ఇవ్వాలని కోరాడు. కానీ అది కుదరదని ఆర్డీవో చెప్పారు.
దీంతో పట్టాదారు పాస్ బుక్ తన పేరున ఇవ్వాలని..లేకుండా ప్రాణాలు తీస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. అంతేకాదు.. తాను చెప్పినట్లుగా చేయకుంటే అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డికి పట్టిన గతే పడుతుందంటూ బెదిరించాడు. దీంతో భయపడిన ఆర్డీవో రాజేంద్ర ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కానీ కానిస్టేబుల్ శ్రీనివాస్ వెర్షన్ వేరుగా ఉంది. తన తండ్రి అమ్మిన భూమిని కొందరు కబ్జా చేశారనీ..తండ్రి వారితో తనకు ఎందుకు అని నా భూమి నేను అమ్ముకుంటాననే ధోరణితో భూమిని వేరొకరికి అమ్మివేశారు. కానీ తన తండ్రి భూమి అమ్మినా..ఆర్డీవో మాత్రం ఆ భూమిని కబ్జా దారులదే నంటున్నారనీ..దానికి సంబంధించి ఆర్డీవో రాజేంద్ర కుమార్ ఆర్డర్ కూడా పాస్ చేసారని కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి ఆర్డీవో ఆరోపిస్తున్నాడు.