మహేష్ బాబు ఫోటో ఎఫెక్ట్: వాలంటీర్ సస్పెండ్.. సచివాలయ ఉద్యోగి కూడా!

  • Published By: vamsi ,Published On : March 1, 2020 / 02:45 AM IST
మహేష్ బాబు ఫోటో ఎఫెక్ట్: వాలంటీర్ సస్పెండ్.. సచివాలయ ఉద్యోగి కూడా!

Updated On : March 1, 2020 / 2:45 AM IST

విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన కారణంగా సచివాలయ ఉద్యోగి, గ్రామ వాలంటీర్ సస్పెండ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన పథకం ‘జగనన్న విద్యాదీవెన’ కార్డులో విద్యార్థి ఫొటోకు బదులు సినిమా హీరో మహేష్ బాబు ఫొటో అప్‌లోడ్‌ చేయడంపై ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. బాధ్యులైన సచివాలయ ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంతోపాటు, ప్రాథమిక స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాలేజీపై సైబర్‌ చట్టం కింద కేసు కూడా నమోదు చేయాలని ఆదేశించింది ప్రభుత్వం.

కర్నూలు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మద్దికెర మండలం పెరవళికి చెందిన లోకేశ్‌గౌడ్‌ పత్తికొండ శ్రీవైష్ణవి కాలేజిలో డిగ్రీ చదువుతున్నాడు. లోకేశ్‌కు జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా కార్డు మంజూరైంది. అయితే, ఆ కార్డులో తన ఫొటో బదులు హీరో మహేష్ బాబు ఫొటో ఉండడంతో అవాక్కయ్యాడు లోకేష్. దీనిపై సోషల్‌ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు నెటిజన్లు.

ఈ ఘటనపై సీరియ్‌స్ అయిన ప్రభుత్వం విచారణ చెయ్యాలంటూ ఆదేశించింది. దీంతో విద్యార్థి ఫొటోను అప్‌లోడ్‌ చేయాల్సిన కాలేజీ నిర్వాహకులు.. సినీహీరో మహేష్ బాబు ఫొటో అప్‌లోడ్‌ చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. కళాశాలపై సైబర్‌ చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే తప్పుగా అప్‌లోడ్‌ అయినా కూడా ఫొటోను గుర్తించని వార్డు సచివాలయ సోషల్‌ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ను సస్పెండ్‌ చేయాలని, అలాగే కార్డులో తప్పులు చూడకుండా విద్యార్ధికి అందించిన వలంటీర్‌ను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.