కాంక్రీట్ రికార్డ్ : పోలవరానికి గిన్నీస్ బుక్ ఆఫీసర్స్

పోలవరానికి ఇద్దరు గిన్నీస్ బుక్ అధికారులు
న్యాయనిర్ణేతలుగా 8మంది నిపుణులు
24మంది రికార్డు పనులు పరిశీలిస్తారు
బ్లాస్టింగ్ వద్ద ప్రతీ 15నిమిషాలకు పనుల పరిశీలన
ఎప్పటికప్పుడు పనుల వేగం నమోదు
పనులను పరిశీలించనున్న గిన్నీస్ బుక్ నిర్వాహకులు
పనుల్లో పాల్గొనున్న 3వేల మంది ఇంజనీర్లు
తూర్పుగోదావరి : ఆసియాలోనే భారీ సాగునీటి ప్రాజెక్టైన పోలవరం.. వరల్డ్ రికార్డ్ నెలకొల్పబోతోంది. కాంక్రీటు పనుల్లో నవయుగ సంస్థ రికార్డులు బద్దలుకొట్టబోతోంది. 24 గంటల్లో 28 వేల నుంచి 30 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేసి గిన్నీస్ రికార్డ్ సృష్టించేందుకు సర్వం సిద్ధం చేసింది. మరో పదేళ్ల వరకు ఈ రికార్డును ఎవరూ అధిగమించలేరని అంటోంది.
ప్రాజెక్టు స్పిల్ వే, స్పిల్ చానల్లో 2019, జనవరి 06 ఉదయం ఏడు గంటల నుంచి జనవరి 07 ఉదయం ఏడు గంటల వరకు.. కాంక్రీటు పనులు నిర్విరామంగా కొనసాగించి గిన్నీస్ రికార్డ్ సృష్టించబోతోంది. 24 గంటల్లో దాదాపు 28 నుంచి 30 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు నింపనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ రికార్డు పనులను పరిశీలించనున్నారు. గతంలో దుబాయ్ లో 35గంటల 19నిమిషాల్లో 21వేల 580 క్యూబిక్ మీటర్ల కాంక్రీటును ఏక ధాటిగా పోసి రికార్డు సృష్టించారు. కాంక్రీటు పనుల్లో కాళేశ్వరం ప్రథమ స్థానంలో ఉంది. ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు నవయుగ సంస్థ ప్రయత్నిస్తోంది.
కార్డుకు నమోదుకు గిన్నిస్ బుక్ అధికారులు ఇద్దరు పోలవరం చేరుకున్నారు. వారితో పాటు పి.హెచ్.డి చేసిన మరో 8 మంది నిపుణులు న్యాయనిర్ణేతలుగా ఉంటారు. మొత్తం 24 మంది ఈ రికార్డు పరిశీలిస్తారు. గిన్నిస్ బుక్ అధికారులు ప్రతి 15 నిమిషాలకోసారి బ్లాస్టింగ్ పాయింట్ల వద్ద ఎంతెంత కాంక్రీట్ తయారవుతోంది, ఏఏ ప్రాంతాల్లో వేస్తున్నారు, క్వాంటిటీ ఎంతనే విషయాలను నిశితంగా పరిశీలిస్తారు.