ఢిల్లీకీ సీఎం జగన్
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. 2019, ఆగస్టు 26వ తేదీ సోమవారం ఉదయం ఏడున్నరకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరుతారు. ఉదయం 11గంటలకు నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరవుతారు. సాయంత్రం వరకు ఈ సమావేశం కొనసాగుతుంది. తిరిగి ఆగస్టు 27వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి సీఎం జగన్ విజయవాడ బయలుదేరుతారు.
ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీఎస్, డీజీపీలతో హోంమంత్రి సమావేశం ఉండనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్షా అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల భద్రతా పరిస్ధితులపై హోంమంత్రి సమీక్షించనున్నారు. 11 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులను హోంశాఖ ఆహ్వానించింది.
ఏపీలో ఆంధ్రా – ఒడిశా సరిహద్దు ప్రాంతంతో పాొటు ఇతర ప్రాంతాల్లో నక్సల్ ప్రభావం ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే నక్సల్స్పై నిషేధాన్ని మరో ఏడాది కొనసాగిస్తున్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ గ్రీన్ హంట్, సమాధాన్ వంటి కార్యాచరణల ద్వారా నక్సలిజం అణిచివేతకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగానే మావోయిస్టు కీలక నేతలను కోల్పోయింది. ఆంధ్రా – ఒడిశా ప్రాంతంలో నక్సలింజం సమస్యను పరిష్కరించే దిశగా ఢిల్లీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత విభజన అంశాలపై పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.