జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం: గ్రామ సచివాలయ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు!

  • Published By: vamsi ,Published On : October 6, 2019 / 03:49 PM IST
జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం: గ్రామ సచివాలయ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకుని వచ్చిన గ్రామ సచివాలయాలు అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సంధర్భంగా అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తాను ఇచ్చిన హామీల్లో ఒక్కటి సచివాలయం కాగా.. ఈ సచివాలయం పరిక్షల విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. విమర్శలు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా కొన్ని పోస్టులకు సంబంధించి వివాదాలు అలుముకున్నాయి.

గ్రామ సచివాలయాల్లో కొన్ని వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టులు ఉండగా.. ఈ పోస్టుల నియామకానికి బీఏ, హ్యూమానిటి సబ్జెక్టు చేసిన వ్యక్తులు అర్హులు. అయితే, ఈ పోస్ట్ లకు బీ.కామ్, బీఎస్సీ చదివిన వ్యక్తులు అప్లై చేశారు. అందులో 21 మందికి ఉద్యోగాలు కల్పించగా.. ఇదే కేటగిరికి ఇంకా చాలామంది ఈ పోస్ట్ లకు అప్లై చేశారు. అయితే, బీకాం, బీఎస్సీ ఉన్న తమను ఎందుకు సెలెక్ట్ చేయలేదని కొంతమంది అభ్యర్థులు కంప్లైంట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఆన్ లైన్ ద్వారానే అప్లికేషన్ వెరిఫికేషన్ జరగగా.. బీకాం, బీఎస్సీ అభ్యర్థులు అర్హులు కారు అని తెలిసి కూడా వారికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారని అధికారులు నిలదీశారు. దీనిని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవడంతో బీ.కామ్, బీఎస్సీ సర్టిఫికెట్స్ తో ఉద్యోగాలు పొందిన 21 మందిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధం అయ్యింది. అంతేకాదు.. విద్యార్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అర్హులు కాని వారికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారంటూ అధికారులపై కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది.

ఎవరైనా సరే ఈ విషయంలో తప్పులు చేసి ఉంటే ఒప్పుకునేది లేదని ప్రభుత్వం చెబుతుంది. ఈ విషయానికి సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ట్విట్టర్ ద్వారా ఓ మీడియా సంస్థ కథనాన్ని కూడా ట్వీట్ చేసి వెల్లడించారు.