శ్రీశైలం పవర్ హౌజ్ లో రెస్క్యూ టీమ్ పురోగతి…ఏఈ సుందర్ సహా ఐదుగురి మృతదేహాల గుర్తింపు

  • Published By: bheemraj ,Published On : August 21, 2020 / 03:10 PM IST
శ్రీశైలం పవర్ హౌజ్ లో రెస్క్యూ టీమ్ పురోగతి…ఏఈ సుందర్ సహా ఐదుగురి మృతదేహాల గుర్తింపు

శ్రీశైలం పవర్ హౌజ్ లో రెస్క్యూ టీమ్ పురోగతి సాధించింది. ఏఈ సుందర్ మృతదేహంతోపాటు మరో నాలుగు మృతదేహాలను గుర్తించింది. మూడో ఫ్లోర్ లో ఏఈ సుందర్ మృతదేహాన్ని గుర్తించింది. సుందర్ మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ బయటకు తీసుకొస్తున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ క్లిష్టంగా ఉన్నప్పటికీ ప్రయత్నం చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యేందుకు మరో ఐదు గంటలు పట్టే అవకాశం ఉంది.



తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలోని శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గురువారం (ఆగస్టు 20, 2020) అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మొదటి యూనిట్ లో పెద్ద పెద్ద శబ్దాలతో పేలుడు సంభవించింది.

భారీగా మంటలు చెలరేగడం, దట్టంగా పొగలు అలుముకోవడంతో పని చేస్తున్న ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు రక్షించుకోవడానికి బయటకు పరుగులు తీశారు. ప్రమాద సమయంలో 17 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో కొంతమంది మహిళా ఉద్యోగులున్నట్లు సమాచారం. సొరంగమార్గం ద్వారా 8 మంది సురక్షితంగా బయటకు వచ్చారు.



గల్లంతైన వారిలో డీఈ, నలుగురు ఏఈలు, ఇద్దరు అమ్రాన్ కంపెనీ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. విద్యుత్ కేంద్రంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ టీమ్, అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరి అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలను ఆయన పర్యవేక్షిస్తున్నారు.