ఖమ్మంలో పొలిటికల్ హీట్ : గులాబీ జోష్..విపక్షాల్లో నైరాశ్యం

  • Published By: madhu ,Published On : March 18, 2019 / 02:48 PM IST
ఖమ్మంలో పొలిటికల్ హీట్ : గులాబీ జోష్..విపక్షాల్లో నైరాశ్యం

ఎన్నికల వేళ.. TRS లో జోష్ కనిపిస్తుంటే.. విపక్షాల్లో మాత్రం పూర్తి నైరాశ్యం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెల్చుకున్నా లోక్‌సభ ఎన్నికల సమయానికి విపక్షం పూర్తిగా డీలా పడిపోయింది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేయి జారుతుంటే.. అసలు ఎవరిని బరిలోకి దింపాలా అనే డైలమా ఖమ్మం కాంగ్రెస్‌లో నెలకొంది.
జిల్లాలో ప్రస్తుతం TRS ఫుల్ జోష్‌తో కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన టీఆర్ఎస్.. విపక్షాల నుంచి శాసన సభ్యులు చేరుతుండటంతో… రెట్టింపు ఉత్సాహంతో లోక్‌సభ సమరానికి సై అంటోంది. ఇప్పటికే పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సమాత్తం చేస్తూ ఎలక్షన్‌కు ముందే ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది TRS. 

గత శాసన సభ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరి చేసుకుని… రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. గ్రామపంచాయితీ ఎన్నికల్లో 80 శాతం గ్రామాల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులే గెలిచారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ…పక్కాగా విజయం సాధించే దిశగా.. టీఆర్ఎస్ వర్కౌట్ చేస్తోంది. ఖమ్మం జిల్లా అంటేనే ఎర్రజెండాల ఖిల్లా అనేవారు. అదంతా గతం. సీపీఎం, సీపీఐలు తమ ఉనికిని కాపాడుకునేందుకే ఆపసోపాలు పడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కలిసి పోటీ చేయాలనే ప్రతిపాదన వచ్చినా… బీఎల్ఎఫ్ పేరుతో సీపీఎం.. చిన్నా చితకా పార్టీలతో జతకట్టింది. కాంగ్రెస్‌కు సీపీఐ సపోర్ట్ చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయనే వాదన వినిపిస్తున్నా ఆ దిశగా అడుగులు పడిన దాఖలాలు కనిపించడం లేదు.

కాంగ్రెస్ పరిస్థితి ఖమ్మంలో అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. నేతలు స్తబ్దుగా ఉండిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలుగా గెల్చినా.. అందులో నలుగురు కారు ఎక్కారు. టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెల్చినా.. ఒక శాసన సభ్యుడు టీఆర్ఎస్‌లో చేరతానని ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరీ తానే పోటీ చేస్తానంటూ పట్టుబడుతున్నారు. టీడీపీ నేత నామా నాగేశ్వరరావు కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నా.. సైకిల్ పార్టీ నుంచి పోటీ చేస్తారా.. లేక కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మార్చి 25వ తేదీన అధినేత కేసీఆర్ బహిరంగ సభ ఉంది. ఆలోపే అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం ఉంది. క్యాండిడేట్ ఎవరైనా.. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అధినేత సూచిస్తుండటంతో.. అభ్యర్థిని గెలిపించుకోవాలనే పట్టుదల టీఆర్ఎస్‌లో కనిపిస్తోంది.