వైఎస్సార్ కంటి వెలుగు : ఆరు విడతలుగా పరీక్షలు
రాష్ట్ర ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కంటి పరీక్షలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు శంకర నేత్రాలయ, ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రి, ఇతర ఎన్జీఓల సహకారం తీసుకుంటామని సీఎం జగన్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ిన పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లాల్లో టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. రూ. 560 కోట్లతో ఈ కార్యక్రమం జరుగనుంది.
సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం కోసం చేసిన ఏర్పాట్లపై కూడా సీఎం జగన్ సమీక్షించారు. అక్టోబర్ 10 నుంచి 16వ తేదీ వరకు తొలి దశలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 70 లక్షల మందికిపైగా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని, రెండో విడతలో నవంబర్ 01 నుంచి డిసెంబర్ 31 వరకు అవసరమైన విద్యార్థులకు శస్త్ర చికిత్సలు చేయిస్తామన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 01 నుంచి మూడు, నాలుగు, ఐదు, ఆరు విడతల్లో మిగిలిన ప్రజలందరికీ దశల వారీగా కంటి పరీక్షలు, చికిత్సలు అందిస్తామన్నారు.
మానవీయ కోణంలో ప్రజల వినతులు పరిష్కరించాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. ప్రధానంగా ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ప్రజల వినతులకు పరిష్కారం చూపాలన్నారు. స్పందన ద్వారా అందే వినతుల పరిష్కారంలో నాణ్యత కోసం కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24, 27 తేదీల్లో, అక్టోబర్లో జిల్లాల స్థాయిలో రెండు రోజుల పాటు వర్క్ షాపులు నిర్వహిస్తామన్నారు.
> స్ర్కీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ శస్త్ర చికిత్సలు
> అక్టోబర్ 10 – 16 వరకు తొలి దశలో 70 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్ష.
> రెండో దశలో నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు శస్త్ర చికిత్సలు.
> ఫిబ్రవరి 01 నుంచి మూడు, నాలుగు, ఐదు, ఆరు విడతల్లో మిగతా ప్రజలందరికీ
Read More : కోడెలపై ఫిర్యాదులు చేసింది ఎవరు.. ఎన్ని కేసులున్నాయి