రాధా పయనమెటు : త్వరలో భవిష్యత్ కార్యాచరణ – రాధా

  • Published By: madhu ,Published On : January 21, 2019 / 04:36 AM IST
రాధా పయనమెటు : త్వరలో భవిష్యత్ కార్యాచరణ – రాధా

విజయవాడ : వంగవీటి రాధా పొలిటికల్ ఎపిసోడ్ ఏపీ రాష్ట్రంలో ఉత్కంఠ కలుగ చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ నేత ఆ పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు. విజయవాడ సెంట్రల్ సీటు కాంగ్రెస్ నుండి వచ్చిన మల్లాది విష్ణుకు కేటాయించేందుకు జగన్ సిద్ధమైనట్లు..వేరే సీటు నుండి పోటీ చేయాలని ఆదేశించడంతో రాధా అలకబూనారు. పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కకుంటే.. రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడిపోతుందని భావించిన రాధా..పార్టీకి ఇక టా..టా..చెప్పేశారు. ఈ మేరకు పార్టీ అధినేత జగన్‌కు జనవరి 20వ తేదీన లేఖ రాసి..భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని చెప్పారు రాధా.  అయితే రాధా రాజీనామా లేఖను జగన్ ఆమోదించలేదు. 
బుజ్జగింపులు : 
ఇదిలా ఉంటే రాధాను బుజ్జగించేందుకు కొడాలి నాని చివరగా రంగంలోకి దిగారు. అయినా రాధా మెత్తబడలేదు. దీనిని క్యాష్ చేసుకోవాలని ప్రధాన పార్టీ టీడీపీ ప్రయత్నిస్తోంది. టీడీపీకి రావడం ఖాయమంటూ నేతలు ప్రకటిస్తున్నారు. మరోవైపు రాధా జనసేన వైపు చూస్తున్నారని మరో ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఏ పార్టీలోకి వెళుతారనేది మాత్రం స్పష్టం కాలేదు. రాధా మాత్రం రెండ్రోజుల్లో తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు. ఒక రకంగా రాధా రాజీనామా వైసీపీకి షాక్‌ తగిలినట్లే అంటున్నారు విశ్లేషకులు.