Covid-19 Treatment: కరోనా చికిత్సకు గైడ్లైన్స్.. సీటీ స్కాన్ వద్దు.. ట్యాబ్లెట్లు వాడొద్దు
కరోనా సెకండ్ వేవ్ దాదాపుగా తగ్గుముఖం పట్టినవేళ కేంద్రం చికిత్సకు సంబంధించి గైడ్లైన్స్ విడుదల చేసింది. కరోనా చికిత్స విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) కీలకమైన మార్పులు చేసి ప్రకటన చేసింది.
DGHS’ advisory on treatment: కరోనా సెకండ్ వేవ్ దాదాపుగా తగ్గుముఖం పట్టినవేళ కేంద్రం చికిత్సకు సంబంధించి గైడ్లైన్స్ విడుదల చేసింది. కరోనా చికిత్స విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) కీలకమైన మార్పులు చేసి ప్రకటన చేసింది. లక్షణాలు లేని వాళ్లకు అసలు ఏ మందులూ వద్దని, స్వల్ప లక్షణాలు ఉంటే, యాంటీపైరెటిక్, యాంటీట్యూసివ్ మందులు వాడొచ్చని స్పష్టంచేసింది.
లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్న వాళ్లకు కొవిడ్ చికిత్స కోసం వాడుతున్న హైడ్రాక్సీక్లోరోక్విన్, ఐవర్మెక్టిన్, డాక్సీసైక్లిన్, జింక్, మల్టీ విటమిన్ల వంటి ట్యాబ్లెట్లు అవసరం లేదని, జ్వరం కోసం యాంటీపైరెటిక్, జలుబు కోసం యాంటీట్యూసివ్ మందులు వాడితే చాలునని వెల్లడించింది. అవనసరంగా పేషెంట్లకు సీటీ స్కాన్లు చేయించొద్దని డాక్టర్లకు సూచించింది. కొవిడ్ను అడ్డుకోవడానికి మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేయాలని ప్రభుత్వాలకు సూచించింది.
కరోనా లక్షణాలు కనిపిస్తే టెలీకన్సల్టేషన్లు జరపాలని, పోషకాహారం తీసుకోవాలని, పేషెంట్లు, కుటుంబ సభ్యులు ఫోన్లో, వీడియో కాల్స్లో మాట్లాడుకుంటూ ఉండాలని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు మాత్రం వారు వాడే మందులను కొనసాగించాలని సూచించింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తే ఆస్పత్రిలో చేరాలని, ఆక్సిజన్ సాచురేషన్ వంటివి చెక్ చేసుకుంటూ ఉండాలని సూచించింది. దగ్గు ఉంటే ఐదు రోజుల పాటు ఆవిరి కోసం బుడెసొనైడ్ 800 ఎంసీజీ డోసు రోజుకు రెండుసార్లు వాడాలని చెప్పింది.