Baba Ramdev : నేపాల్లో బాబా రాందేవ్ కు షాక్.. కరోనిల్ నిలిపివేత
యోగా గురువు, పతంజలి సంస్ధ వ్యవస్ధాపకుడు బాబా రాందేవ్ కు నేపాల్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పతంజలి సంస్ధ కరోనా వైరస్ సోకకుండా తయారు చేసిన కరోనిల్ మందును వాడకూడదని ఆదేశించింది.
Baba Ramdev : యోగా గురువు, పతంజలి సంస్ధ వ్యవస్ధాపకుడు బాబా రాందేవ్ కు నేపాల్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పతంజలి సంస్ధ కరోనా వైరస్ సోకకుండా తయారు చేసిన కరోనిల్ మందును వాడకూడదని ఆదేశించింది. గతంలో భూటాన్ ఈ మందును నిలిపివేయగా తాజాగా నేపాల్ కుడా మందును నిషేధించింది.
బాబారాందేవ్ బహుమతిగా అందించిన 1500 కరోనిల్ కిట్లు వాడకూడదని నిర్ణయించింది. కరోనా వైరస్ను ఎదుర్కోవటంలో కరోనిల్ విఫలం చెందిందని నేపాల్ ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఆ దేశ ఆయుర్వేద మంత్రిత్వశాఖ కరోనిల్ మందును వాడకూడదని నిర్ణయం తీసుకుంది. కరోనిల్ కిట్లో ఉన్న ట్యాబ్లెట్లు, నూనె కరోనా వైరస్ను కట్టడి చేయడంలో విఫలం పొందినట్లు పేర్కొంది.
దీంతో ఆ కిట్ను పంపిణీ చేయడం నిలిపివేసింది. కరోనిల్కు ప్రత్యామ్నాయ మందులకు నేపాల్ ప్రభుత్వం ఆర్డర్లు చేసింది. కరోనిల్ కిట్ను పతాంజలి సంస్థ రూపొందించింది. ఈ మందును 2020 జూన్ 23వ తేదీన విడుదల చేశారు. కరోనా కట్టడిలో ఈ మందు విఫలం చెందిందని పలు సర్వేల నివేదికలు వెల్లడించాయి. దీంతో ఆ మందుకు డిమాండ్ లేకుండాపోయింది.
అయితే పతంజలి సంస్థ మాత్రం తమ కరోనిల్ కిట్ను లక్షల్లో విక్రయించినట్లు పేర్కోంది. కాగా నేపాల్ ప్రభుత్వం దేశంలో కరోనిల్ ను నిషేధించిందని వస్తున్నవార్తలను ఆదేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి డాక్టర్ కృష్ణప్రసాద్ పౌడియాల్ ఖండించారు. ప్రభుత్వం కరోనిల్ కు వ్యతిరేకంగా, నిషేధిస్తున్నట్లు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని పేర్కోన్నారు.