ఇంజనీరింగ్ కన్నా ఎక్కువ : బెంగళూరులో 1వ తరగతి ఫీజు 2లక్షలు
![ఇంజనీరింగ్ కన్నా ఎక్కువ : బెంగళూరులో 1వ తరగతి ఫీజు 2లక్షలు ఇంజనీరింగ్ కన్నా ఎక్కువ : బెంగళూరులో 1వ తరగతి ఫీజు 2లక్షలు](https://10tv.in/wp-content/uploads/2019/01/Bangalore-2-Lakhs-High-Fees-In-Most-Schools.jpg)
ఫీజులు వసూలు చేసే విషయంలో బెంగళూరులోని అనేక ప్రైవేట్ స్కూళ్లు ఇంజనీరింగ్ కాలేజీలతో పోటీ పడుతున్నట్లు అనిపిస్తోంది. సిటీలోని అనేక ప్రైవేట్ స్కూళ్లు విద్యార్ధుల తల్లిదండ్రుల జేబులను ఖాళీ చేస్తున్నాయి. ఒకటో తరగతి ఫీజు మాత్రమే ఏడాదికి రెండు లక్షలు వసూలు చేస్తున్నాయి. అంటే దీన్ని బట్టి ప్రైవేట్ స్కూళ్లు ఇంజనీరింగ్ కాలేజీలను మించి ఫీజులు వసూలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. దీంతో అనేక మంది మధ్యతరగతి ప్రజలు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపించాలంటేనే బయపడుతున్నారు. ఒకటో తరగతికే 2 లక్షలా అని భయపడుతున్నారు.
సిటీలోని ప్రైవేట్ స్కూళ్లు సగటున అకడమిక్ ఇయర్ ఫీజును 80వేలుగా ఫిక్స్ చేశాయి. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ ను ఆఫర్ చేస్తున్న స్కూళ్లు అకడమిక్ ఇయర్ పీజును లక్షల్లో వసూలు చేస్తున్నాయి. బెంగళూరు సిటీలో పేరుపొందిన ప్రెసిడెన్సీ స్కూల్ యాజమాన్యం వచ్చే అకడమిక్ ఇయర్ కి 1.84 లక్షలు వసూలు చేస్తోంది. ఈ సమయంలో నేషనల్ పబ్లిక్ స్కూల్ ఫీజు రూ 1.32 లక్షలగా ప్రకటించింది. గత సంవత్సరం కన్నా ఇసారి 10 శాతం పెరిగింది. ఇది నర్సరీ విద్యార్థులకు తక్కువేం కాదు. దీంతో విద్యార్థుల ఫీజులను ప్రవేట్ స్కూళ్లు తమకిష్టమొచ్చినట్లుగా పెంచుతున్నాయని, వెంటనే ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.