TTD Temple: శాస్త్రోక్తంగా శ్రీవారి మెట్టు నడకదారి పునఃప్రారంభం
శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని గురువారం ఉదయం టీటీడీ చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పునఃప్రారంభించారు. ఈ మార్గంలో భక్తులను తిరుమలకు అనుమతించి..
TTD Temple: శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని గురువారం ఉదయం టీటీడీ చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పునఃప్రారంభించారు. ఈ మార్గంలో భక్తులను తిరుమలకు అనుమతించి.. అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడారు. గతేడాది నవంబరు 18, 19వ తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గంలో బండరాళ్ళు పడి రోడ్డు, మెట్లు, ఫుట్పాత్లు, మరుగుదొడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు.
ఆ తర్వాత ఇంజినీరింగ్ అధికారులు యుద్ధ ప్రాతిపాదికన నడక మార్గాన్ని రూ.3.60 కోట్లతో మరమ్మతు పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలో శ్రీవారి మెట్టు మార్గంలో పనులు పూర్తి చేసిన ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది కాంట్రాక్టర్లను చైర్మన్ అభినందించారు.
ఈ మార్గం గుండా రోజుకు 6 వేల మంది, ప్రత్యేక పర్వదినాల్లో 15 వేల మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారని వివరించారు. శ్రీవారి మెట్టు మార్గంలోనే సాక్షాత్ శ్రీనివాసుడు తిరుమలకు చేరుకున్నట్లు, శ్రీ కృష్ణదేవరాయులు శ్రీవారిని దర్శించుకున్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోందని వివరించారు.
Read Also : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆర్జిత సేవా టికెట్ల కోటా
ఇంజినీరింగ్, కాంట్రాక్టర్లకు సన్మానం :
అనంతరం శ్రీవారి మెట్టు నడక మార్గంలో త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేసిన సీఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఈ – 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఈఈ శ్రీ సురేంద్రరెడ్డి, ఈరోడ్ కు చెందిన ఆర్ఆర్ బిల్డర్స్ డీజీఎమ్ శ్రీ ఆర్ముగంను చైర్మన్ శాలువ, శ్రీవారి ప్రసాదాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎం.ఎల్.ఏ. శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, శ్రీ మొరం శెట్టి రాములు, జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్, శ్రీనివాస మంగాపురం ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీమతి వరలక్ష్మీ, డీఈ శ్రీ రవిశంకర్ రెడ్డి, అదనపు సీవీఎస్ఓ శ్రీ శివకుమార్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.