హోదా పోరు: ఉండవల్లి ఆల్ పార్టీ మీట్
విజయవాడ: ఏపికి ప్రత్యేక హాదాతోపాటు విభజన హామీల అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆల్ పార్టీ మీటింగ్ ను నిర్వహిస్తున్నారు. “ఏపి హక్కుల కోసం పోరాటం” పేరుతో విజయవాడలో మంగళవారం ఉదయం ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని ఏడు పార్టీలను ఆహ్వానించారు ఉండవల్లి. టీడీపీ, వైసీపీ, జనసేన, బిజేపి, కాంగ్రేస్, సిఎఐ, సిపిఎం పార్టీలను ఆయన ఆహ్వానించారు. ఈ భేటీలో ఏపీకి జరిగిన అన్యాయం, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. భవిష్యత్తులో డిమాండ్ల సాధనకోసం ఉమ్మడి కార్యాచరణను రూపొందిస్తామని ఉండవల్లి తెలిపారు.
కాగా….. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్. జాస్తి చలమేశ్వర్ హాజరుకానున్నారు. ఇక అధికార పార్టీ నుండి మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎంపి సీఎం రమేష్ హాజరు కానున్నారు. జనసేన నుండి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ట హజరు అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి రఘువీరారెడ్డి హజరవుతుండగా…బిజేపి హజరుపై ఎటువంటి స్పష్టత రాలేదు. ఇక ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఈ సమావేశానికి దూరంగా ఉంటోంది. వైసీపీ నుండి ఎవరూ ఈ సమావేశానికి హజరు కావడంలేదని ఉండవల్లి చెప్పారు.