గవర్నర్ గా రెబల్ స్టార్ కృష్ణంరాజు ?
కేంద్ర మాజీమంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజుని త్వరలో గవర్నర్ పదవి వరించబోతోందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు తన 80వ పుట్టినరోజు వేడుకలను జనవరి 20న ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన ప్రముఖులందరూ విచ్చేసి శుభాకాంక్షలు అందచేశారు.
ఆ వేడుకలో డార్లింగ్ ప్రభాస్ మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబులతోనూ, తన సోదరీమణులతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం బీజేపీ నాయకులు కృష్ణంరాజు ఇంటికి క్యూకట్టి శుభాకాంక్షలు తెలియచేసారు.
తాజాగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిలు జనవరి 25,శనివారం రాత్రి కృష్ణంరాజు ఇంటికి వచ్చి పుట్టిన రోజు వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రెబల్ స్టార్ తో మరోసారి కేక్ కట్ చేయించారు.
ఈవేడుకల్లో కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో పాటు డార్లింగ్ ప్రభాస్ కూడా పాల్గోన్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర కేంద్ర నాయకులు కృష్ణంరాజు ఇంటికి క్యూ కట్టటం చూస్తుంటే గతకొద్ది రోజులుగా కృష్ణంరాజుకు గవర్నర్ పదవి ఇవ్వబోతున్నారని వినిపిస్తున్న వార్తలకు బలం చేకూరుతోంది.