Family Planning Surgery : నలుగురు మహిళల మృతితో ప్రభుత్వం కీలక నిర్ణయం.. కుటుంబ నియంత్రణ క్యాంపులు నిలిపివేత
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ నియంత్రణ క్యాంపులను తాత్కాలికంగా నిలిపివేసింది.
Family Planning Surgery : కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందడం రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ నియంత్రణ క్యాంపులను తాత్కాలికంగా నిలిపివేసింది.
ఇబ్రహీంపట్నం ఘటనపై నివేదిక వచ్చే వరకు క్యాంపులను నిలిపివేయాలని ఆదేశించింది. నివేదిక వచ్చాకే కుటుంబ నియంత్రణ క్యాంపుల కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రోజుకు 15 ఆపరేషన్లు మాత్రమే చేయాలని గతంలోనే నిబంధన ఉండగా.. అదేమీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఆపరేషన్లు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఒక్క ఇబ్రహీంపట్నంలోనే గంట వ్యవధిలో 34 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు డాక్టర్లు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు విఫలమై నలుగురు మహిళలు మృతి చెందిన ఘటన దుమారం రేపింది. దీనిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు విఫలమై ముగ్గురు మహిళలు మృతి చెందారని.. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందంటూ మీడియా వార్తల ఆధారంగా సుమోటోగా కేసును స్వీకరించింది. ఈ ఘటనకు దారితీసిన కారణాలు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై తీసుకున్న చర్యలకు సంబంధించి అక్టోబర్ 10 నాటికి సమగ్ర నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ఇవ్వాలని ఆదేశించింది.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విఫలమై నలుగురు మహిళలు మృతిచెందిన ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనిపై విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రెండు రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరుగా.. నలుగురు మరణించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరికొంతమంది మహిళల ఆరోగ్యం కూడా విషమంగా మారడంతో వారందరినీ హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇబ్రహింపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరషన్లు చేయించుకున్న మరో ముగ్గురు మహిళలను నిమ్స్కు తరలించారు. దగ్గు, ఆయాసంతో బాధపడుతున్న ఇద్దరు మహిళలను నిమ్స్ స్పెషాలిటీ బ్లాక్ లో చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. అనుభవం ఉన్న సర్జన్తోనే 34 ఆపరేషన్లు చేశామన్నారు. ఆపరేషన్లు పూర్తి అయిన అనంతరం మహిళందరికీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి ఇళ్లకు పించడం జరిగిందన్నారు. ఆ తర్వాత మహిళలు 26, 27 తేదీల్లో గ్యాస్ట్రో లక్షణాలపై ఫిర్యాదు చేశారన్నారు. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారని.. ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవడం జరిగిందన్నారు. ఆపరేషన్లు చేయించుకున్న 34 మందిలో నలుగురు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారని ఇది బాధాకరమైన విషయమన్నారు.
మిగతా 30 మందిని స్క్రీనింగ్ చేస్తున్నామని, వారి ఇళ్లకు ప్రత్యేక బృందాలను పంపి ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిందని, అలాగే డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వారి పిల్లల చదువులకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు.