Mlc Kavitha : అలాంటి వాళ్లను దేశం దాటించారు- రౌస్ అవెన్యూ కోర్టులో కవిత సంచలన వ్యాఖ్యలు

కవితకు పంపించే ఇంటి భోజనాన్ని 10 నుంచి 15మంది పోలీసులు చెక్ చేస్తున్నారని, తర్వాత పాడైన ఆహారాన్ని అందిస్తున్నారని కోర్టుకు వివరించారు.

Mlc Kavitha : అలాంటి వాళ్లను దేశం దాటించారు- రౌస్ అవెన్యూ కోర్టులో కవిత సంచలన వ్యాఖ్యలు

Mlc Kavitha : రౌస్ అవెన్యూ కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని వదిలేసి, వారిని దేశం దాటించి, నా లాంటి వారిని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం అని కవిత వాపోయారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని కవిత కోరారు.

ఇక లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించారు. మే 14వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. కవిత జుడీషియల్ కస్టడీ ముగియడంతో దర్యాఫ్తు సంస్థల అధికారులు కవితను కోర్టు ముందు హాజరుపరిచారు. కవిత కస్టడీ పొడిగించాలని సీబీఐ, ఈడీ కోరాయి. రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరీ బవేజా విచారించారు. కేసు దర్యాఫ్తు పురోగతిని కోర్టుకు వివరించారు ఈడీ, సీబీఐ అధికారులు. కస్టడీ పొడిగించాలని కోరారు.

మరోవైపు కవిత తరపు న్యాయవాది నితీశ్ వాదనలు వినిపించారు. జైల్లో కవితకు పలు పుస్తకాలు అనుమతించాలని కోరారు. కవితకు పంపించే ఇంటి భోజనాన్ని 10 నుంచి 15మంది పోలీసులు చెక్ చేస్తున్నారని, తర్వాత పాడైన ఆహారాన్ని అందిస్తున్నారని కోర్టుకు వివరించారు. డాక్టర్, జైలు అధికారి మాత్రమే చెక్ చేసి అందించాలని కోరారు. దీనిపై జైలు సూపరింటెండెంట్ వివరణ కోరతామని జడ్జి తెలిపారు. 10 పుస్తకాలు ఇచ్చేందుకు అనుమతి ఇచ్చారు. కోర్టులో కవితను 15 నిమిషాల పాటు కలిసేందుకు కుటుంబసభ్యులను అనుమతించాలని కవిత తరపు న్యాయవాది కోరగా అనుమతి ఇచ్చారు. ఇక వారం రోజుల్లోగా కవితపై ఛార్జిషీటు దాఖలు చేస్తామని ఈడీ తెలిపింది. కస్టడీ పొడిగించాలని కోరగా అందుకు కోర్టు అనుమతించింది. మే 14 వరకు కస్టడీకి ఇస్తూ తీర్పు వెలువరించింది.

మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు, జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణతోపాటు.. హెచ్‌డీ దేవెగౌడ కుమారుడు హెచ్‌డీ రేవణ్ణ.. వందలాది మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారనే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారికి సంబంధించిన వీడియోలు దాదాపు 3 వేలకు పైగా బయటికి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. వీడియోలు బయటికి రాగానే జర్మనీ పారిపోయిన ప్రజ్వల్ రేవణ్ణపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అతడిని దేశానికి రప్పించి అరెస్ట్ చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ఏర్పాటు చేసింది.

Also Read : నా బిడ్డను జైల్లో పెట్టినా భయపడను, లొంగిపోయే ప్రసక్తి లేదు- కేసీఆర్