మూడు దశాబ్దాల తర్వాత : ఎన్నికల్లో సిక్స్ కొడతాం
కేంద్రప్రభుత్వం ఫిబ్రవరి-1న లోక్ సభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో గొప్పలు చెప్పుకునేందుకే మోడీ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని, దాని ద్వారా రైతాంగానికి ఒరిగేదేమీ లేదని అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఫిబ్రవరి-3) బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్ లో నిర్వహించిన జన్ ఆకాంక్ష ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్, రాజస్థాన్ సీఎం అకోశ్ గెహ్లోత్, చత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భగేల్ తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పాట్నాలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించింది.
ర్యాలీ పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతూ రైతులకు మాత్రం రోజుకి కేవలం రోజుకి 17రూపాయలనే చెల్లిస్తోందని విమర్శించారు. బీహార్ అభివృద్ధిలో వెనుకబడిపోవటానికి నితీష్, మోడీనే కారణమన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ దారుణంగా మారిందని, నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని మోడీ చెప్పారని, ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా? రాలేదు అని అన్నారు.
తాము అధికారంలోకి వస్తే 10 రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని తాను ప్రమాణం చేశానని, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ రుణమాఫీ చేసిన విషయాన్ని రాహుల్ గుర్తు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాట్నా యూనివర్శిటీకి సెంట్రల్ యూనివర్శిటీ స్టేటస్ ఇస్తామని తెలిపారు. తేజస్వీయాదవ్, లాలూప్రసాద్ లతో కలిసి కాంగ్రెస్ బీహార్ లో ఫ్రంట్ ఫూట్ ప్లే ఆడి సిక్స్ కొడతామని అన్నారు.
Rahul Gandhi at at #JanAakanshaRally in Patna, Bihar: I have said in Uttar Pradesh that Congress party will not play at the back foot but at the front foot. Together with Tejashwi ji & Lalu ji, Congress party will play at the front foot and we will hit a six. pic.twitter.com/TRVUIvXDfV
— ANI (@ANI) February 3, 2019