Kurasala Kannababu : బాబుగారూ.. ఎప్పుడైనా కోడికత్తి చూశారా? అదెంత షార్ప్గా ఉంటుందో- కన్నబాబు ఫైర్
Kurasala Kannababu: అలిపిరిలో దాడిని చంద్రబాబే చేయించుకున్నారని మేము ఎప్పుడైనా అన్నామా? అంత పదునైన కత్తితో దాడి చేస్తే ఎగతాళిగా మాట్లాడతారా?
Kurasala Kannababu : సీఎం జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో దాడి కావాలని చేయించుకున్నదే, అదొక డ్రామా, ఎన్నికల్లో సానుభూతి కోసమే జగన్ ఆ నాటకం ఆడారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. చంద్రబాబుపై ఎదురుదాడికి దిగారు. చంద్రబాబు ఎప్పుడైనా కోడికత్తి చూశారా? అది ఎంత షార్ప్ గా ఉంటుందో అని మాజీమంత్రి కన్నబాబు ప్రశ్నించారు.
అంత పదునైన కత్తితో దాడి చేస్తే ఎగతాళిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడి చంద్రబాబే చేయించుకున్నారని మేము ఎప్పుడైనా అన్నామా? మాకు సంస్కారం ఉంది కాబట్టి అలా అనడం లేదన్నారు కన్నబాబు.(Kurasala Kannababu)
2018లో హత్యాయత్నం చేసి జగన్ ని అంతమొందించాలని చూశారని కన్నబాబు ఆరోపించారు. హత్యాయత్నం జరిగిందని NIA నిర్ధారించిన తర్వాత దానిపై లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం లేదా? అని కన్నబాబు అడిగారు. తీర్పులు ఇవ్వడానికి మీరు ఎవరు? అని నిలదీశారు. ఎల్లో మీడియా రాస్తే చంద్రబాబు అండ్ కో ప్రచారం చేస్తోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉండగా సంఘటన జరిగినప్పుడు ఆ ప్రభుత్వానికి బాధ్యత లేదా? అని కన్నబాబు ధ్వజమెత్తారు.
” హత్యాయత్నం చేసిన వ్యక్తికి నేర చరిత్ర ఉందని మేము ఆనాడే చెప్పాము. NIA ఎప్పుడైనా లోతైన అధ్యయనం చేశామని చెప్పిందా? డీఎల్ రవీంద్రా రెడ్డి రెండు రోజులుగా స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నారు. భారతీ రెడ్డి రాజ్యాంగం అంటారా? రాజకీయాలకు దూరంగా ఉన్న మహిళపై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారా?
డీఎల్ రవీంద్రారెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని మరొకసారి చెబుతున్నాం. ముఖ్యమంత్రి సతీమణిని పట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మీకు కనీసం జ్ఞానం ఉందా? ఇదే విధంగా మీ ఇంట్లో మహిళలపై మాట్లాడితే మీరు ఊరుకుంటారా? ” అని నిప్పులు చెరిగారు కన్నబాబు.
జగన్ పై దాడి ఘటనపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ విశాఖలో కోడికత్తి డ్రామా ఆడారని, టీడీపీకి సంబంధం ఉందని ఆరోపించారని మండిపడ్డారు. కోడికత్తి ఒక నాటకం అని నేను ఆనాడే చెప్పానన్నారు. ఇప్పుడు జాతీయ దర్యాఫ్తు సంస్థ ఎన్ఐఏ కూడా అదే తేల్చిందన్నారు. నిందితుడు శ్రీనివాస్ వైసీపీ కార్యకర్తే అన్న చంద్రబాబు.. కోడికత్తితో ఎవరైనా హత్య చేస్తారా? అని నిలదీశారు. ఎన్నికల ముందు సానుభూతి కోసం ప్రశాంత్ కిషోర్ ఆడించిన గొప్ప నాటకంలో జగన్.. కోడికత్తి కమల్ హాసన్ గా మిగిలిపోయారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.