తెలంగాణలో మే లోనే టెన్త్ పరీక్షలు, ఇక ప్రిపరేషన్ మొదలు పెట్టండి

  • Published By: srihari ,Published On : May 6, 2020 / 02:07 AM IST
తెలంగాణలో మే లోనే టెన్త్ పరీక్షలు, ఇక ప్రిపరేషన్ మొదలు పెట్టండి

కరోనా కారణంగా తెలంగాణలో అర్థాంతరంగా ఆగిపోయిన టెన్త్ పరీక్షల నిర్వహణపై అనుమానాలు తొలిగిపోయాయి. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అసలు పరీక్షలు జరుగుతాయా లేదా అనే సందేహాలకు స్వయంగా సీఎం కేసీఆర్ తెరదించారు. ఈ నెలలోనే అంటే మే లోనే టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం మార్చిలో టెన్త్ పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. మూడు పరీక్షలు జరిగాయి. ఆ తర్వాత కరోనా భయాలతో హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంకా ఎనిమిది పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

పరీక్షా కేంద్రాలను 5వేలకు పెంచుతాం:
మంగళవారం(మే 5,2020) సీఎం అధ్యక్షతన సుదీర్ఘంగా కేబినెట్ సమావేశం జరిగింది. టెన్త్ పరీక్షలు నిర్వహించాలని కేబినెట్ లో నిర్ణయించారు. మంత్రివర్గం సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ హైకోర్టు సూచించిన నిబంధనల ప్రకారం మిగతా 8 పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు భయపడాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. గతంలో ఏర్పాటుచేసిన దాదాపు 2500 పరీక్షా కేంద్రాలను అవసరమైతే 5000కు పెంచుతామన్నారు. ఇంకా అవసరమైతే 5వేల 500 చేస్తామన్నారు. అలాగే భౌతిక దూరం పాటిస్తూ ఒక హాల్‌లో తక్కువ విద్యార్థులుండేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. పరీక్ష గదులను పూర్తిగా శానిటైజ్‌ చేస్తామని చెప్పారు. పరీక్ష రాసే విద్యార్థులకు మాస్కులు అందిస్తామని సీఎం అన్నారు. 

ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి పిల్లలను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లి మళ్లీ తీసుకొస్తాం:
”పరీక్షల నిర్వహణపై కేబినెట్ నిర్ణయం తీసుకొని అడ్వకేట్‌ జనరల్‌కు ఆదేశాలిచ్చింది. తక్షణమే కోర్టులో అప్లయ్‌ చేయమన్నాం. సీజే ముందు అప్లయ్‌ చేసి కన్సంట్‌ తీసుకోమన్నాం. కోర్టు కూడా పర్మిషన్‌ ఇస్తుందని భావిస్తున్నాం. పిల్లలు, తల్లిదండ్రులు టెన్షన్‌లో ఉన్నారు. వీరికోసం అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటాం. విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాటుచేసి. పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లి మళ్లీ తీసుకొస్తాం. ధనవంతుల పిల్లలుంటే వాళ్లకు స్పెషల్‌ కారు పాసులు కూడా ఇస్తాం. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎస్‌ఎస్‌సీ పరీక్షలను మే నెలలోనే పూర్తి చేస్తాం. ఎందుకంటే ఎస్‌ఎస్‌సీ ఆధారంగానే ఇతర అడ్మిషన్స్‌, ఇంటర్ చదువు ఆధారపడి ఉంటుంది” అని సీఎం అన్నారు.

ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్ ప్రారంభం:
ఇంటర్‌ ప్రశ్నాపత్రాల వాల్యుయేషన్ గురించి కూడా సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి కాబట్టి పేపర్లు దిద్దే కార్యక్రమం (స్పాట్‌ వాల్యుయేషన్‌) బుధవారం(మే 6,2020) నుంచి ముమ్మరంగా చేపడతామని సీఎం తెలిపారు. ఇంటర్‌ విద్యార్థులకు కూడా ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. విద్యాశాఖ మంత్రి, కార్యదర్శి, క్యాబినెట్‌ సబ్‌ కమిటీ కూర్చుని ఫైనల్‌ చేస్తారని చెప్పారు. ఇందుకోసం ఏ పద్ధతిని ఫాలో కావాలనే విషయంలో ఒక మాడ్యుల్‌ తయారు చేస్తారని వెల్లడించారు.

పదో తరగతి పరీక్షలను నిర్వహించడంతో పాటు ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ పూర్తి చేస్తామన్నారు. వచ్చే అకమిక్‌ ఇయర్‌ పదిహేను రోజులు ఆలస్యమవుతుందా? జూన్‌కే ఉంటదా? జూలైకి పోతుందా? ఏది ఉత్తమం? ఎలా చేయవచ్చు? రాష్ట్రం, దేశంలో కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని షార్ట్‌ పీరియడ్‌లో డిక్లేర్‌ చేస్తామని సీఎం కేసీఆర్ వివరించారు.

టెన్త్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ఈ నెలలోనే పరీక్షలు నిర్వహిస్తామని స్వయంగా కేసీఆరే ప్రకటించారు. సో, విద్యార్థులు ఇక రెడీ అయిపోయిండి. సీరియస్ గా ప్రిపరేషన్ మొదలుపెట్టడింది. బాగా చదువుకోండి. ఎలాంటి భయాలు పెట్టుకోకండి. శ్రద్ధగా చదువుకుని ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవ్వండి. పేరెంట్స్ కూడా ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని వారు చెబుతున్నారు.

Also Read | హైకోర్టు ఆదేశాల మేరకు టెన్త్‌ పరీక్షలు