PM Modi: అత్యంత కీలకంగా ప్రధాని ‘వరంగల్ పర్యటన’.. 10 వేల మంది పోలీసుల పహారా.. పర్యటన మినట్ టు మినట్ వివరాలు ఇవే

వరంగల్ నగరంలో 27 కిలోమీటర్ల మేర ప్రధాని మోదీ కాన్వాయ్‌ సాగనుంది. మామునూరు ఎయిర్‌పోర్టు నుంచి బట్టల బజార్‌ ఫ్లైఓవర్‌, పాపయ్యపేట చమన్‌, భద్రకాళి ఆలయం, ములుగు రోడ్డు, అలంకార్‌ జంక్షన్‌, హనుమకొండ చౌరస్తా, పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌, అంబేద్కర్‌ జంక్షన్‌, కాళోజీ జంక్షన్‌ మీదుగా ప్రధాని పర్యటన సాగనుంది.

PM Modi: అత్యంత కీలకంగా ప్రధాని ‘వరంగల్ పర్యటన’.. 10 వేల మంది పోలీసుల పహారా.. పర్యటన మినట్ టు మినట్ వివరాలు ఇవే

Warangal Tour: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం వరంగల్‭లో పర్యటించనున్న సందర్భంగా ముమ్మర ఏర్పాట్లలో అధికార యంత్రాంగం తలమునకలైంది. నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఈ ఏర్పట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడే రెండు వేదికలను ఏర్పాటు చేయనున్నారు. ఒక వేదికపై నుంచి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనుండగా.. మరో వేదిక నుంచి బహిరంగ సభకు వచ్చే బీజేపీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

10 వేల మందితో కఠిన భద్రత
ఇక ప్రధాని సభ నేపథ్యంలో భద్రతా దళాలు హెలికాఫ్టర్ ద్వారా గస్తీ నిర్వహిస్తున్నారు. వరంగల్ నగరంలో 27 కిలోమీటర్ల మేర ప్రధాని మోదీ కాన్వాయ్‌ సాగనుంది. మామునూరు ఎయిర్‌పోర్టు నుంచి బట్టల బజార్‌ ఫ్లైఓవర్‌, పాపయ్యపేట చమన్‌, భద్రకాళి ఆలయం, ములుగు రోడ్డు, అలంకార్‌ జంక్షన్‌, హనుమకొండ చౌరస్తా, పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌, అంబేద్కర్‌ జంక్షన్‌, కాళోజీ జంక్షన్‌ మీదుగా ప్రధాని పర్యటన సాగనుంది. ప్రధాని భద్రతా ఏర్పాట్లలో భాగంగా 10 వేల మందితో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు వరంగల్ సీపీ ఏవి రంగనాథ్ తెలిపారు. దీనితో పాటు నేటి నుంచి వరంగల్ నగరంలో రెండు రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్ నగరాన్ని నోఫ్లై జోన్ గా పోలీసు శాఖ ప్రకటించింది. నగరం నుంచి 20 కిలోమీటర్ల వ్యాసార్థంలో గగనతలంలో ఆంక్షలు విధించారు.

వేదికపై మోదీ, కేసీఆర్!
సభా వేదికపై ప్రధనమంత్రితో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. అయితే కేసీఆర్ పాల్గొంటారా లేదా అనేది స్పష్టంగా తెలియదు. ఇక ఈ సభలో కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరి, కిషన్‌రెడ్డి సహా రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ పాల్గొంటారని పీఎంఓ నుంచి సమాచారం అందింది.

వ్యవసాయం, పారిశ్రామికం ప్రధానం
ప్రధాని పర్యటనతో వ్యవసాయ, పారిశ్రామికంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ముందడుగు వేయనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మోదీ ప్రారంభించబోయే, శంకుస్థాపన చేయబోయే పనుల వల్ల ఈ రెండు రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1200 మందికి ఉపాధి లభించనుందట. ఇక రూ.521కోట్ల వ్యయంతో పీవోహెచ్‌ వర్క్‌షాపు, మ్యానిఫ్యాచరింగ్ యూనిట్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు.

రేపటి పర్యటన పూర్తి వివరాలు..
9.25 గంటలకు హైదరాబాద్‌ హకీంపేట ఎయిర్‌పోర్టు చేరుకుంటారు.
9.30 గంటలకు హకీంపేట విమానాశ్రయం నుంచి ఎంఐ-17 హెలీకాప్టర్‌ ద్వారా వరంగల్‌ బయలుదేరుతారు.
10.15 గంటలకు వరంగల్‌ మామునూరు విమానాశ్రయంలోని హెలీప్యాడ్‌లో దిగుతారు.
10.15 గంటలకు మామునూరు ఎయిర్‌స్ట్రిప్‌ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరుతారు.
10.30 గంటలకు భద్రకాళి దేవాలయానికి చేరుకుంటారు.
10.30 నుంచి 10.45 గంటల వరకు అమ్మవారికి పూజలు చేస్తారు.
10.50 గంటలకు భద్రకాళి ఆలయం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరుతారు.
11.00 గంటలకు సుబేదారిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానం చేరుకుంటారు.
11.00 గంటల నుంచి 11.35 గంటల వరకు పీవోహెచ్‌, వ్యాగన్‌ తయారీ యూనిట్‌తో పాటు జాతీయ రహదారుల నిర్మాణాలకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు.
11.45 గంటలకు బహిరంగ సభ వేదిక పైకి చేరుకుంటారు.
11.45 నుంచి 12.20 గంటల వరకు బహిరంగసభలో ప్రసంగిస్తారు.
12.20 నుంచి 12.30 గంటల వరకు పార్టీ నేతలను కలుసుకుంటారు.
12.30 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరుతారు.
12.50 గంటలకు వరంగల్‌ మామునూరు ఎయిర్‌స్ట్రిప్‌ చేరుకుంటారు.
12.55 గంటలకు మామునూరు ఎయిర్‌స్ట్రిప్‌ నుంచి ఎంఐ-17 హెలీకాప్టర్‌లో బయలుదేరుతారు.
1.40 గంటలకు హకీంపేట ఎయిర్‌పోర్టు చేరుకుంటారు.
1.45 గంటలకు హకీంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఐఏఎఫ్‌ బీబీజే విమానం ద్వారా బయలుదేరుతారు.
3.35 గంటలకు రాజస్థాన్‌లోని బికనీర్‌ ఎయిర్‌పోర్టు చేరుకుంటారు.