Botcha Satyanarayana : వచ్చే ఉగాదికి టీడీపీ ఉండదు, ఇంకా చాలా స్కామ్లు బయటకు వస్తాయి- మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స
ఇంతకాలం వ్యవస్థలను మేనేజ్ చేయడం వల్ల చంద్రబాబు తప్పించుకున్నారు. సీఐడీ తప్పుడు రిపోర్టు ఇస్తే.. న్యాయవ్యవస్థ రిమాండ్ ఎందుకు ఇస్తుంది? Botcha Satyanarayana
![Botcha Satyanarayana : వచ్చే ఉగాదికి టీడీపీ ఉండదు, ఇంకా చాలా స్కామ్లు బయటకు వస్తాయి- మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స Botcha Satyanarayana : వచ్చే ఉగాదికి టీడీపీ ఉండదు, ఇంకా చాలా స్కామ్లు బయటకు వస్తాయి- మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స](https://10tv.in/wp-content/uploads/2023/09/Botcha-Satyanarayana-Chandrababu-Arrest.jpg)
Botcha Satyanarayana - Chandrababu Arrest (Photo : Twitter, Google)
Botcha Satyanarayana – Chandrababu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. చంద్రబాబు అరెస్ట్ పాలిటిక్స్ లో హీట్ పెంచింది. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని, ఇది రాజకీయ కక్ష సాధింపేనని టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. తప్పుడు కేసులో చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారని సీఎం జగన్ పై మండిపడుతున్నారు.
టీడీపీ నేతల ఆరోపణలను వైసీపీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు నేరం చేశారు, అందుకే అరెస్ట్ అయ్యారు, ఇందులో కక్ష సాధింపు ఏమీ లేదని తేల్చి చెబుతున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఉగాది నాటికి టీడీపీ అనేది ఉండదు అని బాంబు పేల్చారు బొత్స.
”చంద్రబాబు అవినీతి గురించి మేము మొదటి నుండీ చెబుతూనే ఉన్నాము. ఒకటి, రెండు కాదు చంద్రబాబు స్కామ్ లు అనేకం. త్వరలో అన్నీ బయటకి వస్తాయి. ఇంతకాలం వ్యవస్థలను మేనేజ్ చేయడం వల్ల చంద్రబాబు తప్పించుకున్నారు. అవినీతి చేసి దొరికిపోయి మళ్ళీ బంద్ దేనికి..? బంద్ ప్రభావం ఎలా ఉందో ప్రజలు అందరూ చూశారు. ప్రజల నుండి చంద్రబాబుకి ఎలాంటి మద్దతు లేదు.
చంద్రబాబు అరెస్ట్ చట్ట ప్రకారం జరిగింది. ఆధారాలు ఉన్నాయి కనుకే కోర్టు రిమాండ్ ఇచ్చింది. అన్ని కోణాల్లో విచారణ జరిపి చంద్రబాబును అరెస్టు చేశారు. సీఐడీ తప్పుడు రిపోర్టు ఇస్తే.. న్యాయవ్యవస్థ రిమాండ్ ఎందుకు ఇస్తుంది? అంటే వీళ్లు న్యాయ వ్యవస్థను తప్పుబడుతున్నారా? చంద్రబాబు చేసిన తప్ప ఒప్పుకుని క్షమాపణ చెప్పి రాష్ట్ర రాజకీయాల నుండి వైదొలగాలి. చంద్రబాబు ఏమైనా పెద్ద గొప్పా? తప్పు చేస్తే శిక్ష తప్పదు. ఇన్నాళ్లు మ్యానేజ్ చేసుకుంటూ వచ్చారు. జగన్ వచ్చాక చంద్రబాబు ఆటలు సాగలేదు.
జగన్ పాలనలో చట్టానికి ఎవరూ చుట్టం కాదు. దాని పని అది చేసుకుంటూ పోతుంది. జగన్ కు ఎవరిపైనా వ్యక్తిగతమైన కోపం లేదు. వచ్చే ఉగాది నాటికి తెలుగుదేశం పార్టీ అనేది ఉండదు. అమరావతి రింగ్ రోడ్డు కేసు విచారణ జరుగుతోంది” అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనా మంత్రి బొత్స నిప్పులు చెరిగారు. ”పవన్ అమాయకుడో.. పిచ్చోడా తెలియడం లేదు. సిగ్గుపడి ఇంట్లో కూర్చోకుండా రోడ్లపై అల్లరి చేస్తున్నాడు. నీ పార్టనర్ తప్పు చేసినా తప్పు అని చెప్పాలి కదా. జగన్ పై కేసులు ఆపాదించారు. ఆనాడు అయన వ్యవస్థలో లేరు. తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి విచారణ ఎదుర్కొంటున్నారు. కానీ చంద్రబాబు వ్యవస్థలో ఉండగా చేశారు. ఆయనే సంతకం పెట్టారు. తప్పు చేసిన బాధ చంద్రబాబులో లేదు. దబాయించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంతిమంగా న్యాయం, ధర్మానిదే విజయం” అని మంత్రి బొత్స అన్నారు.