మాజీమంత్రి గంటా ప్రధాన అనుచరుడు అరెస్ట్

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సోషల్ మీడియాలో అధికార పార్టీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారన్న

మాజీమంత్రి గంటా ప్రధాన అనుచరుడు అరెస్ట్

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సోషల్ మీడియాలో అధికార పార్టీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారన్న

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. విచ్చలవిడి కామెంట్లతో, అసభ్యకర పోస్టులతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నవారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. తాజాగా టీడీపీ సానుభూతిపరుడు, మాజీమంత్రి గంటా శ్రీనివాస్ రావు ప్రధాన అనుచరుడు నలంద కిషోర్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం(జూన్ 23,2020) విశాఖలో తెల్లవారుజామున ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌, ప్రభుత్వ ప్రతినిధుల ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను, ప్రచారాలను ఫార్వర్డ్ చేసినట్లు నలంద కిషోర్ పై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో నలంద కిషోర్‌ను సీఐడీ అదుపులోకి తీసుకుంది.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కథనం ఇదే:
కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో మంత్రి, కంత్రీ పేరుతో ఒక కథనం వైరల్ అవుతోంది. అందులో పేర్లు లేకపోయినా… విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్‌ల గురించే కథనం అనుకునేలా దాన్ని తయారు చేశారు. విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్ ల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడంతో పాటు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా కథనాన్ని సృష్టించారని వైసీపీ నేతలు ఆరోపించారు. దీన్ని నలంద కిషోర్ ఫార్వడ్డ్ చేశారని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

నలంద కిషోర్ పాత్ర ఉన్నట్లు తేల్చిన సీఐడీ:
వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు మూడు రోజుల క్రితమే ఈ పోస్టు మూలాన్ని కనుగొన్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌కు అత్యంత సన్నిహితుడైన నలంద కిషోర్‌కు మూడు రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై లోతుగా దర్యాప్తు చేసిన సీఐడీ ఈ తెల్లవారుజామున నలంద కిషోర్‌ను అరెస్ట్ చేసింది. నలంద కిషోర్ గంటాకు అత్యంత సన్నిహితుడే కాకుండా గంటా ప్రత్యర్థులపై వ్యతిరేక ప్రచారం చేస్తుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై తప్పుడు కథనాలను, వీడియోలను చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని నలంద కిషోర్ పై అభియోగం ఉంది. నలంద కిషోర్ కు అసలు ఈ సమాచారం ఎవరు ఇచ్చారు? ఎవరికి ఈ తప్పుడు పోస్టులు పంపించారు? అని సీఐడీ ఆరా తీస్తోంది. కిషోర్ తో పాటు మరో నలుగురు టీడీపీ కార్యకర్తలు కూడా వైసీపీ మహిళా నేతలపై అనుచిత పోస్టులు పెట్టినట్టు సీఐడీ ఫిర్యాదు అందింది. వారి కోసం కూడా సీఐడీ పోలీసులు గాలింపు చేపట్టారు.

ఫార్వార్డ్ చేస్తే అరెస్ట్ చేస్తారా? కిషోర్ అమాయకుడు
నలంద కిషోర్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న గంటా శ్రీనివాస్‌ సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. అధికారుల తీరుని గంటా తప్పుపట్టారు. తన అనుచరుడి అరెస్ట్ ని ఆయన ఖండించారు. వాట్సాప్‌లో వచ్చిన స్టోరీని ఫార్వార్డ్ చేస్తే దానికే అరెస్ట్ చేయడం దారుణమన్నారు. నలంద కిషోర్‌కు 70ఏళ్ల వయసు అని… అలాంటి వ్యక్తిని రాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని గంటా మండిపడ్డారు. ఎవరో సృష్టించిన కథనంలో ఎవరి పేర్లూ లేవని అలాంటప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారని గంటా ప్రశ్నించారు. నలంద కిషోర్ కు ఆ స్టోరీ ఎక్కడి నుంచో వచ్చిందని, దాన్ని ఆయన ఫార్వర్డ్ చేశారని గంటా చెప్పారు. ఆ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని కూడా నలంద కిషోర్ చెప్పారని గంటా తెలిపారు. ఇంత చెప్పిన తర్వాత కూడా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇది చాలా అన్యాయం అన్నారు. అందరూ దీన్ని ఖండించాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు సమంజసం కాదన్నారు. ప్రభుత్వానికి తనపై ఏదైనా కోపం ఉంటే నేరుగా తనపైనే యాక్షన్ తీసుకోవాలన్నారు గంటా. తన అచరుడు కావడం వల్లే నలంద కిషోర్ ను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. నలంద కిషోర్ అమాయకుడు అని గంటా చెప్పారు.

Read: వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా, ఆందోళనలో ఎమ్మెల్యేలు.. ఏపీ శాసనసభ్యుల్లో ఇదే తొలి కేసు