కాంగ్రెస్ + తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా?: కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటైర్లు

కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ పేరు రాలేదని.. రాష్ట్రానికి ఘోర అన్యాయం ప్రజలను రెచ్చగొట్ట్టిన కాంగ్రెస్ నేతలు రాష్ట్ర బడ్జెట్‌లో ఏ ఒక్క జిల్లా, నియోజకవర్గం ప్రస్తావన చేయలేదు కదా.. దీనికేం సమాధానం చెబుతారని నిలదీశారు.

కాంగ్రెస్ + తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా?:  కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటైర్లు

Union Minister Bandi Sanjay hot comments on Telangana budget 2024

Bandi Sanjay on Telangana budget 2024: తెలంగాణ బడ్జెట్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను రాబోయే ఐదేళ్లలో కూడా అమలు చేయడం అసాధ్యమని బడ్జెట్‌తో తేలిపోయిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి, అప్పులకు.. మీరిచ్చిన అలవి కాని హామీలకు మధ్య ఉన్న అంతరాన్ని గ్రహించాలని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు సూచించారు. బడ్జెట్‌లో ఏ ఒక్క నియోజకవర్గం ఊసే లేదని.. సీఎం సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ పేరు రాలేదని.. రాష్ట్రానికి ఘోర అన్యాయం ప్రజలను రెచ్చగొట్ట్టిన కాంగ్రెస్ నేతలు రాష్ట్ర బడ్జెట్‌లో ఏ ఒక్క జిల్లా, నియోజకవర్గం ప్రస్తావన చేయలేదు కదా.. దీనికేం సమాధానం చెబుతారని నిలదీశారు. బడ్జెట్‌లో పేరు ప్రస్తావించకపోయినంత మాత్రాన ఆ ప్రాంతాలకు అన్యాయం చేసినట్లా? రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తారా? అని ప్రశ్నలు గుప్పించారు.

”గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో, కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం అంతే నిజమనే దానికి బడ్జెట్ నిదర్శనమని సైటర్లు వేశారు. కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? 6 గ్యారంటీలు + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? భట్టి విక్రమార్క గారు.. మీరు చదివింది ఆర్దిక బడ్జెట్టా లేక అప్పుల పత్రమా? అప్పులున్నందున హామీలను అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నారా? అప్పులున్న విషయం ముందు మీకు తెలిసి కూడా 6 గ్యారంటీలిచ్చిన మీరు వాటన్నింటికీ బడ్జెట్‌లో నిధులెందుకు కేటాయించలేదు? 6 గ్యారంటీలు సహా హామీల అమలుపై చర్చ జరగకుండా ఉండేందుకే కేంద్రాన్ని బదనాం చేయాలనుకుంటున్నారా?

బడ్జెట్ కేటాయింపులకు సరిపడ ఆదాయం ఎక్కడి నుండి సమకూర్చుకుంటారో బడ్జెట్ లో లెక్కా పత్రం చూపకపోవడం విడ్డూరం. సర్కారీ భూములన్నీ అడ్డికి పావుశేరు అమ్మాలనుకుంటున్నారా? హామీలను అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ కు మాటలెక్కువని బడ్జెట్ చూస్తే అర్ధమవుతోంది. రూ.లక్షన్నర కోట్లతో నిర్మిస్తామన్న మూసీ రివర్ ఫ్రంట్‌కు బడ్జెట్‌లో పైసా కేటాయించని మీరా కేంద్రంపై విమర్శలు చేసేది? ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ మెజారిటీ హిందూ ప్రజలకు తీవ్రమైన నష్టం చేయడమేనా మైనారిటీ డిక్లరేషన్ అంటే?

Also Read : మోసం చేశారు, అన్ని వర్గాలను నిరాశపరించారు- బడ్జెట్‌పై హరీశ్ రావు

రుణమాఫీవల్ల రైతులకు లాభం కంటే నష్టమే జరిగిందని ప్రభుత్వమే ఒప్పుకుంది. రైతులకు జరిగిన నష్టాన్ని పూడ్చి డిఫాల్టర్ల జాబితా నుండి తొలగిస్తారా, లేదా చెప్పాలి. ఏడాదిపాటు నష్టపోయిన ‘రైతు భరోసా’, రూ.500 బోనస్, పంట నష్ట పరిహారం నిధులను కూడా ఈ ఏడాది చెల్లిస్తారా, లేదా? ఇప్పటికైనా పీఎం ఫసల్ బీమాలో చేరాలని నిర్ణయించడం సంతోషం. 90 లక్షల తెల్ల రేషన్ కార్డులుంటే 39 లక్షల మందికే గ్యాస్ సబ్సిడీ ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం దారుణం. 50 లక్షల మంది అర్హులకు రూ.500 సబ్సిడీని ఎగ్గొట్టి మహిళల్లో వెలుగులు నింపామని చెప్పుకోవడం సిగ్గు చేటు. ఇందిరమ్మ ఇండ్లు, ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో కేంద్ర నిధులున్నాయని బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం విడ్డూరమ”ని బండి సంజయ్ విమర్శించారు.

Also Read : తెలంగాణ బడ్జెట్‌పై స్పందించిన కేసీఆర్.. అసెంబ్లీలో చీల్చిచెండాడుతామని వార్నింగ్