Vinesh Phogat : అనర్హత వేటు.. ఆస్పత్రిలో చేరిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్..
భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడడం యావత్ భారతావనిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
Vinesh Phogat Admitted Hospital : భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడడం యావత్ భారతావనిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒలింపిక్స్ చరిత్రలో ఫైనల్ చేరిన తొలి భారత మహిళా రెజ్లర్గా ఆమె చరిత్ర సృష్టించింది. అయితే.. ఫైనల్ మ్యాచ్కు కొన్ని గంటల ముందు నిర్ణీత బరువు కంటే కొన్ని గ్రాములు అధికంగా ఉండడంతో ఆమెపై అనర్హత వేటు పడింది. ఈ క్రమంలో ఫోగట్ అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. డీహైడ్రేషన్ కారణంగా స్మృహ కోల్పోవడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చినట్లుగా సమాచారం.
మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో వినేష్ ఫోగట్ పోటీపడుతోంది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మ్యాచ్లో బుధవారం అమెరికా రెజ్లర్ సారా హెండెబ్రాండ్తో వినేష్ తలపడాల్సి ఉంది. అయితే.. మంగళవారం రాత్రికి ఆమె నిర్ణీత బరువు కన్నా రెండు కిలోలు అదనపు బరువు కలిగి ఉంది. దీంతో ఆమె బరువు తగ్గడం కోసం జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ వంటివి చేసింది. భోజనం చేయకపోగా.. రాత్రి అంతా మేల్కొని బరువును తగ్గించుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్కు షాక్.. వినేశ్ ఫొగాట్పై అనర్హత వేటు
ఈ క్రమంలో ఆమె డీహైడ్రేషన్కు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెకు ఒలింపిక్స్ గ్రామంలోని పాలిక్లినిక్లో ట్రీట్మెంట్ జరుగుతున్నట్లు ఆ వార్తల సారాంశం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.
బరువు తగ్గించుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసినప్పటికి వెయిట్ పరీక్షల సమయానికి 100 గ్రాముల అదనపు బరువును ఆమె కలిగి ఉంది. ఆమెకు ఇంకొంత సమయం ఇవ్వాలని భారత అధికారుల అభ్యర్థనను ఒలింపిక్స్ అధికారులు తిరస్కరించారు. అంతేకాకుండా ఆమె పై అనర్హత వేటు వేశారు. దీంతో ఫైనల్ కు చేరుకున్నప్పటికి వినేశ్ ఫోగట్ ఎలాంటి పతకం లేకుండా భారత్కు తిరిగి రావాల్సి ఉంటుంది.