Paddy Grain : వరి ధాన్యపు నిల్వలో జాగ్రత్తలు

గిడ్డంగులలో పక్షులు రాకుండా తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లకు ఇనుప జాలీలు, బిగించి కట్టుదిట్టం చేయాలి. లోహపు రేకులు తలుపు కింద సందు లేకుండా అరడుగు వరకు బిగించాలి.

Paddy Grain : వరి ధాన్యపు నిల్వలో జాగ్రత్తలు

Paddy

Paddy Grain : ఆరుగాలం శ్రమించి ఎన్నో కష్టనష్టాల కోర్చి పండించిన పంటను విక్రయించేంత వరకు జాగ్రత్తగా నిల్వచేసుకోవటం అన్నది చాలా ముఖ్యం. ఈ విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా పడ్డకష్టమంతా వృధాగా మారటంతోపాటు , ఆర్ధికంగా నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వరి పంట నిల్వచేసే విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు పాటించటం మంచిది. వరి పంట నిల్వకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

వరి కోతల అనంతరం ధాన్యాన్ని బాగా ఎండబెట్టు కోవాలి. వాటిని నిల్వచేసేందుకు సిమెంట్ కాంక్రీటు గోదాములను సిద్ధం చేసుకోవాటం మంచిది. సిమెంట్ గోదాములలో నిల్వఉంచుకుంటే పురుగుల బారి నుండి రక్షించవచ్చు. క్రిమి కీటకాలు, వాటి గుడ్లు పొలం నుండి గింజల ద్వారా నిల్వ చేసే గోదాంలోకి ప్రవేశించకుండా జాగ్రత్తచర్యలు చేపట్టాలి. ధాన్యాన్ని బాగా శుభ్రపరిచి దుమ్ము, ధూళి, చెత్త, చెదారం, తాలు గింజలు లేకుండా శుభ్రపర్చాలి. ధాన్యాం నూర్పిడి చేసే ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎడ్లబండ్లు, ట్రక్కులు, ట్రాక్టర్లు, వాటి టైర్లు మొదలగునవి శుభ్రముగా ఉంచాలి. ధాన్యం నిలువకు కొత్త గోనె సంచులను, పాతవైతే ఎలాంటి పురుగులు లేని వాటిని వాడాలి. ఎండబెట్టే ముందు గోనె సంచుల పై మందు చల్లి అందులో నిల్వచేయాలి.

నిల్వ చేసే గోదాములలో తేమ, వర్షపు నీరు ప్రవేశించకుండా గోదాముల నేలపై, పై కప్పులలో పగుళ్లు, రంధ్రాలు లేకుండా సిమెంటుతో పూడ్చివేయాలి. దుమ్ము, ధూళి లాంటి చెత్త ఏదైనా ఉంటే ధాన్యపు కోట్ల నుంచి తొలగించి నాశనం చేయాలి. ఆహారధాన్యాలు నిల్వ చేయడానికి తగిన నిర్మాణాలను ఎంపిక చేసుకోవాలి. లోనికి తేమ, ఎలుకలు, పక్షులు ప్రవేశించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలుకల బొరియలకు గాజు ముక్కలు,రాళ్లు, మట్టి, సిమెంటుతో కన్నాలను మూసేయాలి.

గిడ్డంగులలో పక్షులు రాకుండా తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లకు ఇనుప జాలీలు, బిగించి కట్టుదిట్టం చేయాలి. లోహపు రేకులు తలుపు కింద సందు లేకుండా అరడుగు వరకు బిగించాలి. ఇలా చేయడం వలన ఎలుకలు లోనికి ప్రవేశించకుండా చేయవచ్చు. అవి ధాన్యాన్ని తినడమే కాకుండా రెట్టలను , వెంట్రుకలు, మిగతా వ్యర్థాలను చేర్చి పాడు చేస్తాయి. అవి తినడం వలన మనకు జబ్బులు సంక్రమించే అవకాశం ఉంది. తడి తగలకుండా ఉండేందుకు బస్తాల కింద చెక్క దిమ్మెలను ఉంచాలి. బస్తాలకు తేమ తగలకుండా వెదురు తడికలను వాడాలి.

నిల్వ ధాన్యాలకు కీటకాలు , ఎలుకలు ఆశిస్తే రసాయన మందులు వాడి నివారణ చేపట్టాలి. గోదాములలో ఆహార ధాన్యాలకు పురుగు పట్టకుండా 4 వారాలకొకసారి 50 శాతం మలాథియాన్ పిచికారీ చేయాలి. లీటరు నీటికి 10 మి. లీ. వంతున 3 లీటర్ల మలాథియాన్ మందు ద్రావణాన్ని 100 చ.మీ. విస్తీర్ణంలో పిచికారీ చేయాలి. తక్కువ పరిమాణంలో నిల్వ చేసినప్పుడు వేపాకు, వేపగింజల పొడి , వెల్లుల్లి గుజ్జు, సీతాఫలం గింజల పొడి ధాన్యంలో కలిపితే కీటకాల బెడద తగ్గుతుంది.