Chittoor: సంచలనం సృష్టించిన పలమనేరు యువకుడి హత్య కేసులో నిందితుల అరెస్ట్
ఏపీలోని చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. హత్యకాబడిన యువకుడి ప్రేయసితో పాటు ఆమె తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు.

Chittore
Chittoor: ఏపీలోని చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. హత్యకాబడిన యువకుడి ప్రేయసితో పాటు ఆమె తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. యువతితో ఏకాంతంగా గదిలో ఉన్న ధనశేఖర్ అనే యువకుడిని.. యువతి తండ్రి హత్యచేసి బాడీని ముక్కలు చేసి పొలంలో పాతిపెట్టిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంట గ్రామానికి చెందిన ధనశేఖర్(23)బెంగళూరులో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పక్కింట్లో ఉండే 16 ఏళ్ల బాలికను కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా శేఖర్ గ్రామానికి రాగా ఈ నెల 22న ఇంట్లో ఒంటరిగా ఉన్నానని బాలిక తన తండ్రి ఫోన్ ద్వారా అతడికి మెసేజ్ చేసింది. దీంతో శేఖర్ ఆమె ఇంటికి వెళ్లి ఏకాంతంగా ఉన్న సమయంలో బాలిక తండ్రి బాబు ఇంటికి వచ్చాడు. తన కూతురితో గదిలో ఉన్న ధనశేఖర్ను చూసి ఆవేశంతో రగిలిపోయాడు.
మీ ప్రేమ విషయం గురించి నీతో మాట్లాడాలి రమ్మంటూ శేఖర్ ను బాలిక తండ్రి పొలానికి తీసుకెళ్లి చంపేసి బావిలో పడేశాడు. అయితే.. మూడు రోజుల తరువాత మృతదేహం బావిలో తేలడంతో బయటకి తీసిన బాలిక తండ్రి శవాన్ని మూడు ముక్కలు చేసి పొలంలో పూడ్చిపెట్టాడు. అయితే.. యువకుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. అయితే.. బాలిక తండ్రే తమ కుమారుడిని ఏదో చేసి ఉంటాడని శేఖర్ కుటుంబసభ్యులు గురువారం ఆందోళన దిగడంతో పోలీసులు సెల్ ఫోన్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కాగా, విచారణలో బాలిక తండ్రి బాబు పోలీసులు విస్తుపోయేలా నిజాలను చెప్పాడు. హత్య చేసిన తీరును ఆ తర్వాత శవాన్ని ముక్కలు చేసి పూడ్చిపెట్టడం వరకు సీన్ వివరించడంతో శుక్రవారం మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు మృతదేహం ముక్కలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ కేసులో పోలీసులు తాజాగా శేఖర్ ప్రేయసిగా చెప్పుకుంటున్న బాలికతో పాటు ఆమె తండ్రిని, కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు.