Chandra Mouli: విధి వక్రించినా పట్టుదలతో పైకొచ్చాడు.. ఐఐఎం సీటు సాధించిన దివ్యాంగుడు..
రెండు కాళ్లు, చేతులు కోల్పోయిన తరువాత చంద్రమౌళికి కుటుంబ సభ్యులు, స్నేహితులు కొండంత అండగా నిలిచారు. చంద్రమౌళికూడా ఏదైనా సాధించాలన్న పట్టుదలతో చదువుపై ఫోకస్ పెట్టాడు.
Chandra Mouli: పట్టుదల, ధైర్యంతో ముందుకు సాగితే ఎలాంటి అవరోధాలనైనా తట్టుకొని ముందకెళ్లొచ్చునని నిరూపించాడు ద్వారపురెడ్డి చంద్రమౌళి. దివ్యాంగుడైన చంద్రమౌళి.. ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా కష్టపడి చదివాడు. మధ్యలో ఆగిపోయిన ఇంజనీరింగ్ తో పాటు న్యాయవిద్యను సైతం పూర్తిచేసి అమెజాన్ సంస్థలో డేటా ఆపరేషన్ అసోసియేట్ ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం ఇంటి వద్ద ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే.. ఇప్పుడు ఏకంగా క్యాట్లో ఉత్తీర్ణుడై ఐఐఎం సీటు సాధించాడు. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) స్కైబ్ సహాయంతో రాసి ఉత్తీర్ణత సాధించాడు. తద్వారా దేశంలోనే అత్యున్నత బిజినెస్ స్కూల్ గా పేరున్న అహ్మదాబాద్ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం)లో సీటు సాధించాడు. చంద్రమౌళి ఈ నెల 21న అహ్మదాబాద్ ఐఐఎంలో చేరనున్నాడు.
కాళ్లు, చేతులు కోల్పోయి..
ద్వారపురెడ్డి చంద్రమౌళి తండ్రి వెంకటరమణ చిరు వ్యాపారి. తల్లి సత్యవతి ప్రైవేట్ స్కూల్ టీచర్. వీరిది అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట గ్రామం. చంద్రమౌళి చదువుల్లో చిన్నతనం నుంచి చురుగ్గా ఉండేవాడు. బీటెక్ చదువుతున్న సమయంలో సెలవుల్లో ఇంటికొచ్చాడు. 2018 మే నెలలో మేడపై ఉండగా ప్రమాదవశాత్తూ పడిపోయిన తన సోదరి ఉంగరాన్ని తీస్తుండగా విద్యుదాఘాతంకు గురయ్యాడు. ఈ ప్రమాదంలో చంద్రమౌళి రెండు చేతులు, రెండు కాళ్లను వైద్యులు తొలగించారు. మూడు నెలలు పాటు ఆస్పత్రిలో ఉన్నాడు.
Viral News: మూడేళ్లుగా మూల గదిలోనే.. తల్లీకూతుళ్లను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో..
రెండు కాళ్లు, చేతులు కోల్పోయిన తరువాత చంద్రమౌళికి కుటుంబ సభ్యులు, స్నేహితులు కొండంత అండగా నిలిచారు. దీంతో చంద్రమౌళికూడా ఏదైనా సాధించాలన్న పట్టుదలతో చదువుపై ఫోకస్ పెట్టాడు. మధ్యలో ఆగిపోయిన ఇంజనీరింగ్ ను పూర్తిచేశాడు. ఆ తరువాత నెమ్మదిగా ల్యాప్ టాప్ ఆపరేట్ చేయడం అలవాటు చేసుకున్నాడు. కృత్రిమ కాళ్ల సహాయంతో నడవడంకూడా అలవాటు చేసుకున్నాడు. ఆ తరువాత అనకాపల్లిలో బీఎల్ పూర్తిచేశాడు. కొద్దికాలానికి అమెజాన్లో ఉద్యోగం సాధించాడు.
సొంతంగా క్యాట్కు సిద్ధం..
ఒకవైపు ఇంటి నుండి ఉద్యోగం చేస్తూనే.. పట్టుదలతో చదివి కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్) స్వ్కైబ్ సహాయంతో రాసి చంద్రమౌళి ఉత్తీర్ణత సాధించాడు. ఈ టెస్ట్ కోసం అతను యుట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్లను సద్వినియోగం చేసుకున్నాడు. దేశంలో అత్యున్నత బిజినెస్ స్కూల్ ఐఐఎంలో సీటు సాధించిన చంద్రమౌళిక మే 21న ఐఐఎంలో జాయిన్ కానున్నాడు.