వైఎస్ఆర్ ఉన్నంతకాలం ఓ వెలుగు వెలిగిన ఆయన, మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారు, చిత్తూరు జిల్లాలో ఇప్పుడిదే సంచలనం

  • Published By: naveen ,Published On : September 16, 2020 / 04:15 PM IST
వైఎస్ఆర్ ఉన్నంతకాలం ఓ వెలుగు వెలిగిన ఆయన, మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారు, చిత్తూరు జిల్లాలో ఇప్పుడిదే సంచలనం

సీకే జయచంద్రారెడ్డి అలియాస్ సీకే బాబు…. అభిమానులు పెట్టుకున్న ముద్దు పేరు చిత్తూరు టైగర్. జిల్లాలో ఒకప్పుడు ఆయన పెను సంచలనం. చిత్తూరు పట్టణం ఆయన అడ్డా. ఈ మాస్ మహరాజ్‌కు జిల్లా అంతటా అభిమానులు ఉండేవారు. నాలుగుసార్లు చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో రాయలసీమ ప్రాంత అభివృద్ధి మండలి చైర్మన్‌గా కూడా కొంతకాలం పనిచేశారు. అలాంటి నాయకుడు ఇప్పుడు కనిపించకుండా పోవడం చర్చనీయాంశం అయ్యింది. ఇప్పుడు ఆయన వైసీపీకి మరోసారి దగ్గరవుతున్నారనే ప్రచారం మొదలైంది.

సాధారణ కార్మిక నేతగా కెరీర్ ప్రారంభం:
చిత్తూరు పట్టణంలో ఓ సాధారణ కార్మిక నేతగా సీకే బాబు కేరియర్‌ ప్రారంభమైంది. తొలుత కౌన్సిలర్‌గా గెలిచి మునిసిపల్ వైస్ చైర్మన్ అయ్యారు. తక్కువ కాలంలోనే చిత్తూరు పట్టణవాసుల మనసు గెలుచుకున్నారు. 1989 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా చిత్తూరు నుంచి పోటీ చేసి అనూహ్యంగా విజయం సాధించారు.

అటు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1994, 1999 ఎన్నికల్లోనూ గెలిచారు. 1994 ఎన్నికల ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నాడు జిల్లాలోని 15 స్థానాల్లో 14 చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, ఒక్క చిత్తూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సీకే బాబు విజేతగా నిలిచి తన సత్తా ఏంటో మొత్తం రాష్ట్రానికి చాటారు.

టికెట్ రాకుండా చేసిన మర్డర్ కేసు:
వ్యక్తిగతంగా, రాజకీయంగా సీకే బాబుకు శత్రువులు ఉన్నారు. ఈ కారణంగానే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఓ కాలేజీ విద్యార్థి మర్డర్ కేసు ఆయనను బాగా ఇబ్బంది పెట్టింది. దీంతో 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన సీకే బాబు ఓటమి పాలయ్యారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2009 ఎన్నికల్లో మరో సారి కాంగ్రెస్ టిక్కెట్ సాధించి చిత్తూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

వైసీపీలో ఒంటరి అయ్యారు:
వైఎస్ మరణం తర్వాత నాటి సీఎంలు రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డిలతో సీకే బాబు ఇమడలేకపోయారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అక్కడి పరిణామాలు ఆయనకు ఇబ్బందిగా మారాయి. ఫలితంగానే 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. నాటి చిత్తూరు వైసీపీ అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులుకు మద్దతుగా నిలిచారు. ఆ ఎన్నికల్లో చిత్తూరు స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. సీకె బాబు క్రమంగా వైసీపీలో ఒంటరవుతూ వచ్చారు. చివరకు ఆయన్ను వైసీపీ దూరం పెట్టింది.

టీడీపీ ఓటమితో మళ్లీ డీలా:
కొంతకాలం సైలెంట్‌గా ఉన్న సీకే బాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2017 నవంబరులో అనూహ్యంగా బీజేపీలో చేరారు. నాడు టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఉండడంతో 2019 ఎన్నికల్లో చిత్తూరు సీటు పొందవచ్చని సీకే భావించారు. కానీ, చాన్స్‌ దక్కలేదు. కొన్నాళ్లకు టీడీపీ, బీజేపీ పొత్తు చెదిరిపోవడంతో మళ్లీ సీకే సందిగ్ధంలో పడ్డారు. బీజేపీకి దూరమయ్యారు.

2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా ఆయన టీడీపీలో చేరారు. పోటీకి దూరంగా ఉంటూ చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. అంతా తలకిందులైంది. పార్టీ ఓటమి పాలైంది. దీంతో సీకే బాబు మళ్లీ డీలా పడిపోయారు. ముప్పయ్యేళ్ల పొలిటికల్ కెరీర్‌లో ఆయనకు అత్యంత గడ్డు స్థితి ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు.
https://10tv.in/heres-the-intriguing-v-trailer/
మళ్లీ వైసీపీకి దగ్గర అవుతున్నారు:
ఎన్నికల తర్వాత సీకే బాబు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇంటికే పరిమితం అయ్యారు. ఇప్పుడు మళ్లీ వ్యూహం మార్చారు. అధికార వైసీపీకి మళ్లీ దగ్గర కానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అతి త్వరలో ఆయన వైసీపీ కండువా కప్పుకొంటారని చెబుతున్నారు. సీకే బాబు సతీమణి లావణ్యకు సైతం రాజకీయాలంటే మక్కువే. కుమారుడు సాయి కృష్ణను కూడా రాజకీయంగా తెరపైకి తెస్తున్నారట. మొన్న జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో తన కుమారుడితో కలిసి సీకే లావణ్య పాల్గొనడం నగరంలో చర్చనీయాంశం అయ్యింది.

సీకే బాబు కుటుంబం మళ్లీ వైసీపీలోకి రావడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. వైసీపీ జిల్లా ముఖ్యులతో సీకే కుటుంబానికి ఇది వరకు ఉన్న వైరం అంతా సమసిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా సీకే బాబు మళ్లీ జిల్లా రాజకీయాల్లో తెరపైకి రానుండడం జిల్లా అంతటా సంచలనంగా మారింది.