వైఎస్సార్ చేయూత : అక్క, చెల్లెమ్మలు సొంతంగా నిలబడటానికి వ్యాపారం చేయండి – సీఎం జగన్

  • Published By: madhu ,Published On : August 12, 2020 / 12:30 PM IST
వైఎస్సార్ చేయూత : అక్క, చెల్లెమ్మలు సొంతంగా నిలబడటానికి వ్యాపారం చేయండి – సీఎం జగన్

మహిళల జీవితాల్లో వెలుగులు నింపే పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ చేయూత పథకాన్ని సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పథకంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 25 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. 25 లక్షల మంది ఖాతాల్లో 18 వేల 750 రూపాయల చొప్పున జమ కానుంది.

‘అక్క, చెల్లెమ్మలు తమ కాళ్లమీద తాము నిలబడాలి. కాని, ఇదే చేయాలని ఏ అక్కమీద కూడా ఆంక్షలు లేవు. ఇది పూర్తిగా మీ స్వేచ్ఛ. ప్రభుత్వం మాత్రం అక్కచెల్లెమ్మలకోసం ఏడాదికి రూ.18750 ఇస్తుంది. ‘డబ్బు దేనికి వాడుకోవాలన్నది అది వారి ఇష్టం.

ప్రభుత్వం చూపించిన అవకాశాల వల్ల లాభం జరుగుతుందని అనుకుంటే.. వారికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఎన్ని ఉన్నా, అట్టడుగున ఉన్న మహిళలకు చేయూత నందించడానికి, వారి కాళ్లమీద వాళ్లు నిలబడ్డానికి ఈనిర్ణయం తీసుకున్నాం. దాదాపు 23 లక్షల కుటుంబాలకు ఈరోజు మేలు జరుగుతుంది’. అన్నారు సీఎం జగన్.

డబ్బును ఎలా ఖర్చు పెట్టాలనే విషయం : 
ఈ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలనే విషయంలో ఎలాంటి షరతుల్లేవని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వారి ముందుకు వ్యాపార అకాశాలను ముందుకు తీసుకు వచ్చామని, పాల రంగంలో దేశంలోనే దిగ్గజ సంస్థ అమూల్‌తో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. రిలయన్స్, హిందుస్థాన్‌ లీవర్, ప్రాక్టర్‌ అండ్‌ గాంబల్, ఐటీసీ లాంటి దిగ్గజ కంపెనీలో ఒప్పందాలు చేసుకున్నామన్నారు.

ఇంకా ఏమన్నారంటే..

పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు : 
రాబోయే కాలంలో మరిన్ని పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటాం. మహిళలకు వ్యాపార అవకాశాలను అందుబాటులోకి తీసుకు రావడమే లక్ష్యం. ప్రభుత్వం చూపుతున్న వ్యాపార అవకాశాలను ఉపయోగించుకోవాలని, దాని ద్వారా మేలు పొందాలని అనుకుంటే… ఆప్షన్‌ ఇవ్వొచ్చు. దీనికోసం బ్యాంకులతో కూడా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. కంపెనీలు.. తమ ఏజెన్సీలకు ఇచ్చే రేటుకన్నా తక్కువ రేటుకు తమ ఉత్పత్తులను ఇస్తారు. దీనివల్ల ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా వృద్దిచెందేలా సుస్థిర జీవనోపాధి పొందవచ్చు.

సీఎం జగన్ రెండు పేజీల లేఖ : 
గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు తాను రాసిన రెండు పేజీల లేఖతో మీ ముందుకు వస్తారు. తమకు మేలు జరుగుతుందని అక్కలు అనుకున్నప్పుడు.. ఆ ఆప్షన్‌ ఎంపిక చేసుకున్న తర్వాత సెర్ప్, మెప్మా ప్రతినిధులు ఆ మహిళతో మాట్లాడతారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడతారు, బ్యాంకులతో ఆ అధికారులు మాట్లాడుతారు. ఆ వ్యాపారంలో వాళ్లు అడుగుపెట్టేలా ముందుకు సాగుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45–60 ఏళ్లవరకూ ఉన్న మహిళలకు నాలుగేళ్లలో రూ.75వేలు. ప్రతి ఏటా రూ.18750. ఈ డబ్బును సద్వినియోగం చేసుకోవాలి.

పేరు లేకపోతే కంగారు వద్దు :
జాబితాలో ఎవరిపేరైనా లేకపోతే ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన పనిలేదన్నారు సీఎం జగన్. గ్రామ సచివాలయానికి వెళ్లి అర్హతలు చూసుకుని మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. వచ్చే నెలలో ఈ దరఖాస్తులను పరిశీలించి అందరికీ అందేలా చర్యలు తీసుకుంటారన్నారు.

60 ఏళ్లు వచ్చే వరకూ ఈపథకం : 
60 ఏళ్లు వచ్చే వరకూ ఈపథకం కొనసాగుతుంది.. అక్కడ నుంచి వారికి పెన్షన్‌ ప్రారంభం అవుతుందన్నారు. ఆ సమయానికి ఏడాదికి దాదాపు రూ.30వేల రూపాయలు వస్తాయన్నారు. 45 ఏళ్లు వయసు చేరుకున్న తర్వాత ప్రతి ఏటా మహిళలు ఈ పథకంలోకి వస్తారని, అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా ఈ కుటుంబాలకు మేలు జరగాలని కోరుకుంటున్నామన్నారు సీఎం జగన్.