DGP Rajendranath Reddy : ఆధార్ డేటా, ఫింగర్ ప్రింట్స్ ఎవరికి ఇవ్వొద్దు: డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో లోన్ యాప్స్పై ప్రత్యేక నిఘా ఉంచామని డీజీపీ రాజేంద్రనాథ్ తెలిపారు.
DGP Rajendranath Reddy : ఆంధ్రప్రదేశ్లో లోన్ యాప్స్పై ప్రత్యేక నిఘా ఉంచామని డీజీపీ రాజేంద్రనాథ్ తెలిపారు. ఇటీవలి కాలంలో ఆన్ లైన్ లోన్ యాప్ల ద్వారా లోన్ తీసుకుని, తిరిగి కట్టలేక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతుండడం బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. కొన్ని ఫోన్ కాల్స్ ప్రైవేట్ నెంబర్స్ నుంచి వస్తున్నాయని, సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు.
లోన్యాప్ నిర్వాహకులు వేధింపులకు పాల్పడితే బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీజీపీ చెప్పారు. ఆధార్ డేటా, ఫింగర్ ప్రింట్స్ కొత్త వారికి ఎవరికి ఇవ్వవద్దని ఆయన సూచించారు. లోన్యాప్ల డేటాను సేకరిస్తున్నామని, లోన్ వసూళ్లలో బయటి వ్యక్తుల ప్రమేయం ఉంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని DGP హెచ్చరించారు.
కాగా డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి ఈరోజు అనంతపురం పోలీసు శిక్షణా కళాశాల లో నిర్వహిస్తున్న సైబర్ క్రైం ఇన్వెస్టిగేషన్ శిక్షణా కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ శిక్షణా కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది హజరయ్యారు. ఈ సంధర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాల దర్యాప్తు అత్యంత కీలకంగా మారిందన్నారు. ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటూ వేరే ప్రదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తుల అకౌంట్లను ట్యాంపర్ చేయడం, డబ్బు దోచుకోవడం తరుచూ జరుగుతున్నాయని లోన్ కావాలనో, లాటరీ తగిలిందనో నమ్మబలుకుతూ ఓటిపి నంబర్ సేకరించి తద్వారా బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేస్తుండటం వంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు.
ఈ రకమైన నేరాలపైన పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల బాధితులు పోలీసు స్టేషన్లకు వచ్చినప్పుడు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండే పరిస్థితులు అక్కడక్కడ ఉన్నాయని … పోలీసులు ఇలా ఉండకూడదని… కచ్చితంగా దర్యాప్తుపై అవగాహన ఉండాలని సూచించారు. ఈ శిక్షణలో నేర్చుకున్సది మీ స్టేషన్లకు వెళ్లి మిగితా వారికి తెలియజేస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఆయన తెలిపారు.
సైబర్ నేరాలపై ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఏ ప్రొఫార్మాలో ఉండాలి, ఎలా డిటెక్ట్ చేయాలి, అఫెండర్ ఎవరు, అకౌంటును ఏవిధంగా సీజ్ చేయాలో తెలిస్తే మళ్లీ డబ్బు సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్లకుండా అడ్డుకోవచ్చు.. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేలా నైపుణ్యం పెంపోందించుకోవాలని సిబ్బందికి సూచించారు. ఇటీవల కాలంలో అధికమైన ఈ నేరాల ఛేదింపు సమాజానికి అవసరమని డీజీపీ చెప్పారు.