జమిందార్ల భూములే ఎలుగుబంటి టార్గెట్.. బెజవాడ భూ మాఫియాపై సీఐడీ ఫోకస్, భూదందాకు సహకరించిన అధికారులపై కేసులు
Elugubanti Haribabu: బెజవాడ భూ మాఫియాపై సీఐడీ ఫోకస్ చేసింది. ఎలుగుబంటి హరిబాబు భూదందాకు సహకరించిన అధికారులపై కేసులు నమోదు చేశారు. రెవెన్యూ, పోలీసు అధికారుల విచారణకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేశారు. హరిబాబుకు సహకరించిన ఐదుగురు రెవెన్యూ, నలుగురు పోలీసు సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రిలో హరిబాబు భూ కబ్జాలు చేశాడు.
జమీందార్ల భూములను టార్గెట్ చేసి భూకబ్జాలకు పాల్పడ్డాడు. 150కోట్ల రూపాయల భూముల్ని కాజేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు సీబీసీఐడీకి అప్పగించడంతో హరిబాబు ఫ్యామిలీ పరారీలో ఉంది. హరిబాబు కోసం వేర్వేరు బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు.
అక్షరం ముక్క చదువుకోలేదు, కన్నింగ్ తెలివితేటల్లో మాత్రం మాస్టర్ మైండ్:
ఎలుగుబంటి హరిబాబు.. అక్షరం అంటే ఎంటో తెలియని వ్యక్తి. కానీ కన్నింగ్ తెలివితేటల్లో మాస్టర్ మైండ్. ఖరీదైన భూములపై కన్నేసి.. చాలా న్యాక్గా కబ్జా చేయడంలో దిట్ట. బెజవాడ కేంద్రంగా శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రిలో హరిబాబు అండ్ కో ల్యాండ్ మాఫియాను విస్తరించాడు. రాజమండ్రిలో కంచుమత్తి పార్థసారథి జమిందారుల స్థలంపై కన్నేసిన హరిబాబు.. ఆఘమేఘాల మీద నకిలీ పత్రాలు సృష్టించాడు. రెవెన్యు అధికారులతో పాటు పోలీసుల సహకారంతో తనదైన స్టయిల్లో కథ నడిపించాడు.
యజమానిని నేనే అంటూ జమీందార్ స్థలాన్ని ఒకరికి అంటగట్టే ప్రయత్నం చేశాడు. బాగా తెలిసిన వ్యక్తి అయిన ఆళ్ల శ్రీనివాసరావును మచ్చిక చేసుకుని అతనితో డాక్యుమెంట్లపై సాక్షి సంతకం చేయించాడు. తీరా చూస్తే అవి తన భూమి రిజిస్ట్రేషన్ పత్రాలు అని తెలుసుకుని అవాక్కయ్యాడు. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరితో దాదాపు 150కోట్ల రూపాయల భూముల్ని హరిబాబు కాజేశాడు.