Sajjala On Sharmila Arrest : షర్మిల అరెస్ట్ బాధాకరం.. వైసీపీకి షర్మిల పార్టీకి సంబంధం లేదు-సజ్జల
మా నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, మా ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల. ఆమె పట్ల తెలంగాణలో జరిగిన ఘటన మాకు వ్యక్తిగతంగా బాధ కలిగించింది. అయితే, షర్మిల పార్టీ వేరు, మా పార్టీ వేరు. ఆమె రాజకీయ విధానాలపై స్పందించబోము అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
Sajjala On Sharmila Arrest : తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ ఘటనపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. షర్మిల అరెస్ట్ వ్యక్తిగతంగా బాధాకరం అన్నారాయన. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన సజ్జలకు.. షర్మిల్ అరెస్ట్పై ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి ఆయన స్పందించారు. షర్మిల అరెస్ట్ బాధాకంర అంటూనే.. ఆమె పార్టీ వేరు, తమ పార్టీ వేరు అని తేల్చి చెప్పారు.
”మా నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, మా ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల. ఆమె పట్ల తెలంగాణలో జరిగిన ఘటన మాకు వ్యక్తిగతంగా బాధ కలిగించింది. అయితే, షర్మిల పార్టీ వేరు, మా పార్టీ వేరు. వైసీపీకి, షర్మిల పార్టీకి సంబంధం లేదు. రాజకీయంగా షర్మిల స్టాండ్ వేరు, వైసీపీ స్టాండ్ వేరు. ఆమె రాజకీయ విధానాలపై స్పందించబోము” అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
సోమవారం నర్సంపేటలో షర్మిల వాహనంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై షర్మిల ఫైర్ అయ్యారు. ‘ప్రగతి భవన్ ముట్టడి’ పేరుతో నిరసన కార్యక్రమం తలపెట్టారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
దీంతో హైదరాబాద్లో హైడ్రామా నడిచింది. పోలీసుల కన్నుగప్పి లోటస్ పాండ్ నుంచి సోమాజిగూడ చేరుకున్న షర్మిల.. సోమాజిగూడ నుంచి ప్రగతి భవన్కి వెళ్లేందుకు ప్రయత్నించారు. టీఆర్ఎస్ నేతల దాడిలో పాక్షికంగా ధ్వంసమైన తన కారును ఆమె స్వయంగా డ్రైవింగ్ చేశారు. అలర్ట్ అయిన పోలీసులు.. ఆమెను అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే వాహనం నిలిచిపోయింది. కారు నుంచి బయటికి రావాలని పోలీసులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. ఆమె నిరాకరించారు. ప్రగతి భవన్ కి వెళ్తానంటూ పట్టుబట్టారు. కారు డోర్లను లాక్ చేసుకుని లోపలే ఉండిపోయారు షర్మిల. ఇక, చేసేదేమీ లేక.. షర్మిల కారు లోపల ఉండగానే.. ఆ కారును క్రేన్ సాయంతో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. ఆ తర్వాత కారు డోర్స్ బ్రేక్ చేసి షర్మిలను పీఎస్లోకి తరలించారు.
పోలీస్ స్టేషన్కు భారీగా వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని చెదరగొట్టారు. మరోవైపు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో షర్మిలపై కేసు నమోదైంది. వీఐపీ మూమెంట్ ఏరియాలో ట్రాఫిక్ జామ్కు కారణమయ్యారని కేసు నమోదు చేశారు.
అటు.. షర్మిల అరెస్ట్ వార్త గురించి తెలుసుకున్న ఆమె తల్లి వైఎస్ విజయమ్మ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లేందుకు బయల్దేరారు. అయితే, పోలీసులు ఆమెను లోటస్పాండ్ వద్దే అడ్డుకుని గృహనిర్బంధం చేశారు. పంజాగుట్ట, ఎస్సార్ నగర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి విజయమ్మను బయటకు అనుమతించ లేదు పోలీసులు. ‘నా కూతురుని చూసేందుకు వెళ్లనివ్వరా.. నేను చూడని పోలీసులా? నేను చూడని ప్రభుత్వాలా?’ అంటూ పోలీసుల తీరుపై విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.