Sajjala Ramakrishna Reddy : ఆ కేసులో.. ఏ క్షణమైనా చంద్రబాబు అరెస్ట్..!- సజ్జల సంచలన వ్యాఖ్యలు
Sajjala Ramakrishna Reddy : అరెస్ట్ చేస్తే వేధింపులు అంటారు. చెయ్యకపోతే ధైర్యం లేదు అంటున్నారు. కచ్చితంగా అరెస్టులు ఉంటాయి. చంద్రబాబు అవినీతిపై గట్టి ఆధారాలు ఉన్నాయి.
Sajjala Ramakrishna Reddy : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని సజ్జల బాంబు పేల్చారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు.
సిట్పై న్యాయస్థానం ఏ దృష్టిలో చూడాలో అదే దృష్టిలో చూసిందన్నారు సజ్జల. రాజకీయ పార్టీలు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష చెయ్యొచ్చా? లేదా? అన్నది ఎప్పుడూ చర్చనీయాంశమే అన్నారాయన. గత ప్రభుత్వంలో జరిగిన నిర్ణయాలపై సమీక్ష జరగడం మంచిదే అన్నారు సజ్జల. స్వార్థపూరితంగా జరిగిన కొన్ని నిర్ణయాల వల్ల ప్రజలకి నష్టం కలిగించినప్పుడు కచ్చితంగా సమీక్ష జరగాల్సిందే అన్నారు.(Sajjala Ramakrishna Reddy)
మా ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసి అసెంబ్లీలో చర్చించిన తర్వాతే సిట్ ఏర్పాటు జరిగిందని సజ్జల గుర్తు చేశారు. అది, మేము కక్షపూరితంగా తీసుకున్న నిర్ణయం కాదని ఆయన తేల్చి చెప్పారు. తప్పు జరిగింది కనుకే సిట్ వేశామన్నారు. సిట్ ఏర్పాటును ఛాలెంజ్ చెయ్యడంలోనే టీడీపీ నేతల భయం కనిపిస్తుందన్నారు సజ్జల. సిట్ వెయ్యగానే ఎందుకంత భయపడి కోర్టులకు వెళ్లారు? అని టీడీపీ నేతలను ప్రశ్నించారు సజ్జల. భయం లేనప్పుడు ఎందుకు కోర్టులకు వెళ్లారని నిలదీశారు. కొన్ని సాంకేతిక కారణాలు చూపి హైకోర్టులో స్టే తెచ్చుకున్నారని చెప్పారు.
” రాజధాని కుంభకోణంలో సీఐడీ విచారణ జరుగుతోంది. అమరావతి అనేది దేశంలోనే అతిపెద్ద ల్యాండ్ స్కామ్. అమరావతిలో ఎక్కడ తడిమినా అవినీతే. రాజధాని పెట్టేందుకు అవకాశం లేని చోట రాజధాని పెట్టారు. రాజధాని పేరు చెప్పి దోచుకోవాలని చూశారు. అది అవ్వలేదు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అరెస్ట్ చేస్తే వేధింపులు అంటారు. చెయ్యకపోతే ధైర్యం లేదు అంటున్నారు. ఏం పీకారు అంటున్నారు?(Sajjala Ramakrishna Reddy)
కేసుల విచారణ జరుగుతోంది. కచ్చితంగా అరెస్టులు ఉంటాయి. చంద్రబాబు అవినీతిపై గట్టి ఆధారాలు ఉన్నాయి. తప్పు చేశారు కనుక తండ్రీకొడుకుల్లో భయం ఉంది. పైకేమో భీకరంగా మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు స్టే తీసేసింది కనుక కేసు విచారణను ఎదుర్కోండి. సిట్ టీమ్ పై ప్రభుత్వం, డిపార్ట్ మెంట్ నిర్ణయం తీసుకుంటుంది. చంద్రబాబు ఫేక్ శంకుస్థాపనలు చేశారు. ఎలాంటి అనుమతులు రాకుండా కొబ్బరికాయ కొట్టారు. మేము అన్ని అడ్డంకులు తొలగించి నిజమైన శంకుస్థాపనలు చేస్తున్నాం” అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.(Sajjala Ramakrishna Reddy)
ఇక మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యవహారంపైనా సజ్జల స్పందించారు. ”అది పార్టీ ఇంటర్నల్ ఇష్యూ అని ఆయన అన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా అని బాలినేని అంటున్నారు. టీ కప్పు లేదు, తుపానూ లేదు. రజనీకాంత్ కి చంద్రబాబు ఫోన్ చెయ్యడం ఎవరైనా విన్నారా? చూశారా? ఏపీకి తీసుకెళ్లి నన్ను తిట్టించారని అన్నాడేమో?” అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.(Sajjala Ramakrishna Reddy)
సిట్పై స్టే ఎత్తివేత.. ఏపీ ప్రభుత్వానికి ఊరట
టీడీపీ ప్రభుత్వ విధాన నిర్ణయాలపై దర్యాప్తు కోసమని ఏపీ ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వం హయాంలో అమరావతిలో భారీ ల్యాండ్ స్కామ్ జరిగిందని, భారీ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని, దీనిపై దర్యాఫ్తు కోసం అంటూ ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా.. దీన్ని సవాల్ చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా తదితరులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
దీంతో సిట్పై హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే, హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. సిట్ పై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టేసింది. ఈ కేసును మరోసారి మెరిట్ ప్రాతిపదికన విచారించి తుది నిర్ణయాన్ని వెలువరించాలని హైకోర్టుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సూచించింది.
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసమేనా? అని ప్రశ్నించింది. హైకోర్టు ముందుగా ఈ విషయంలో జోక్యం చేసుకుందని, అందుకే మధ్యంతర ఉత్తర్వులను తోసిపుచ్చుతున్నామని వెల్లడించింది.(Sajjala Ramakrishna Reddy)