తిరుపతిలో ఎస్సై దురుసు ప్రవర్తన…కంప్లైంట్‌ చేయడానికి వెళ్లిన యువతిపై బెల్ట్ తో దాడి

  • Published By: bheemraj ,Published On : December 6, 2020 / 12:14 PM IST
తిరుపతిలో ఎస్సై దురుసు ప్రవర్తన…కంప్లైంట్‌ చేయడానికి వెళ్లిన యువతిపై బెల్ట్ తో దాడి

SI Attack young woman with belt : కంప్లైంట్‌ చేయడానికి వెళ్లిన యువతిపై ఎస్సై దాడికి పాల్పడిన ఘటన తిరుపతిలో వెలుగు చూసింది. కంప్లైంట్‌ చేస్తావా అంటూ యువతి అని కూడా చూడకుండా ఎస్సై… వీరంగం సృష్టించాడు. ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన యువతిపై బెల్ట్‌తో దాడికి పాల్పడ్డాడు. రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధఙకారులు విచారణ ప్రారంభించారు.



తిరుపతి శివారులోని ఉప్పరపల్లెకు చెందిన వనితావాణి… పక్కింటి వారికి మధ్య గొడవ జరిగింది. పక్కింట్లోని యువకులు వనితావాణిపై దాడికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వనితావాణి ఎంఆర్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది.



అయితే ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తనపట్ల ఎస్సై ప్రకాష్‌ దురుసుగా ప్రవర్తించాడని బాధితురాలు ఆరోపిస్తోంది.
అసభ్యపదజాలంతో దూషిస్తూ… బెల్డ్‌తో కొట్టినట్టు వాపోయింది. ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా దాడి చేశాడని కన్నీరుమున్నీరయ్యింది.



ఎస్సై తనపట్ల ప్రవర్తించిన తీరుపై ఆ యువతి రాత్రి పీఎస్‌ ముందే ఆందోళనకు దిగింది. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఫోన్‌లో జిల్లా ఎస్పీకి ఎస్సైపై కంప్లైంట్‌ చేసింది. దీంతో ఎస్పీ రమేష్‌రెడ్డి విచారణకు ఆదేశించారు.



ఎస్సై దురుసు ప్రవర్తనపై విచారణ జరుపుతున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మొత్తం ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు. తప్పు ఉందని తేలితే ఎస్సై ప్రకాష్‌పై చర్యలు తీసుకుంటామన్నారు.