Tirumala Temple: ఏప్రిల్ 1 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు పునఃప్రారంభం: ఆన్లైన్లో టికెట్లు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. టికెట్లను మార్చి 20న ఆన్లైన్లో
Tirumala Temple: కలియుగప్రత్యక్ష దైవం.. తిరుమల శ్రీనివాసుడి భక్తులకు టీటీడీ అధికారులు తీపి కబురు అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈమేరకు గురువారం నాడు టీటీడీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను మార్చి 20వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు న్నారు. భక్తులు ఇది గమనించి tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Also read: CM Jagan : 30.76 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ.. పేదలకు తక్కువ ధరకే స్టీల్, సిమెంట్ : సీఎం జగన్
సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను ఆన్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయిస్తారు. ఈ సేవలను బుక్ చేసుకునేందుకు మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి మార్చి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టికెట్ల కేటాయింపు జరుగుతుంది. టికెట్లు పొందినవారి జాబితాను మార్చి 22వ తేదీ ఉదయం 10 గంటల తరువాత వెబ్సైట్లో పొందుపరుస్తారు. అదేవిధంగా భక్తులకు ఎస్ఎంఎస్, ఇ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. టికెట్లు పొందిన భక్తులు రెండు రోజుల్లోపు టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. కాగా, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను “ముందు వచ్చిన వారికి ముందు” అనే ప్రాతిపదికన భక్తులు నేరుగా బుక్ చేసుకోవచ్చు.
Also Read: Holi : రంగుల పండుగకు నగరం సిద్ధం.. జాగ్రత్తలు తీసుకోండి
పర్వదినాల్లో పలు ఆర్జిత సేవలు రద్దు: ఇదిలాఉంటే, పండుగల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఏప్రిల్ 2న ఉగాది సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంను రద్దు చేయగా, ఏప్రిల్ 10న శ్రీరామనవమి సందర్భంగా తోమాల, అర్చన, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు. వసంతోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 14 నుండి 16వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను, ఏప్రిల్ 15న నిజపాద దర్శనం సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అదేవిధంగా, శ్రీ పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా మే 10 నుండి 12వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు, జూన్ 14న జ్యేష్టాభిషేకం మూడో రోజున అష్టదళపాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దయ్యాయని అధికారులు పేర్కొన్నారు.
Also read: Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి స్వయంభువుల దర్శనం
కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి:
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ కానీ రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భక్తులు ఆరోగ్యం, టీటీడీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.