ఉద్రిక్తతలకు దారి తీసిన టీడీపీ ధర్మ పరిరక్షణయాత్ర

ఉద్రిక్తతలకు దారి తీసిన టీడీపీ ధర్మ పరిరక్షణయాత్ర

TDP Dharma Parirakshanayatra : ఏపీలో విగ్రహాల ధ్వంసం రాజకీయంగా ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఆలయాల్లో విగ్రహాల ధ్వంసానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ధర్మ పరిరక్షణ యాత్రకు పిలుపునిచ్చింది. టీడీపీ నేతల యాత్రకు పోలీసులు అనుమతి రద్దు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతల నిర్బంధం, చంద్రబాబు విమర్శలు, వైసీపీ నేతల కౌంటర్లతో ధర్మ పరిరక్షణ యాత్ర కాస్త రాజకీయ రణరంగాన్ని తలపించింది. టీడీపీ ధర్మ పరిరక్షణ యాత్ర తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

టీడీపీ నేతలు బస చేసిన హోటల్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అచ్చెన్నాయుడితో పాటు నక్కా ఆనందబాబు, అమర్‌నాథ్‌ రెడ్డి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌తో పాటు ఇతర నేతలను పోలీసులు హోటల్ లోనే నిర్బంధించారు. హోటల్‌ వద్దకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్మపరిరక్షణ యాత్ర జరిగితే ముఖ్యమంత్రి నిజస్వరూపం బయటపడుతుందనే అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు విమర్శించారు.

మరోవైపు దేవుళ్ల విగ్రహాల ధ్వంసంపై స్పందించడమే టీడీపీ నేతలు తప్పా అంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. విజయసాయిరెడ్డిని ఏ చట్టం కింద రామతీర్ధానికి అనుమతించారో డీజీపీ చెప్పాలన్నారు. వైసీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించిందని టీడీపీ నేత కళా వెంకట్రావ్‌ విమర్శలు చేశారు.

చంద్రబాబు తీరుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విగ్రహాల ద్వంసంపై చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారన్నారు. ఏదేమైనా విగ్రహాల ధ్వంసం అంశంతో వెడేక్కిన రాజకీయాలు ఇప్పుడప్పుడే చల్లారే పరిస్థితులు కనిపించడం లేదు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో అటు అధికార వైసీపీ, ఇటు విపక్ష టీడీపీ, బీజేపీ పార్టీలు పరస్పరం విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.