Chitravathi River : ప్రేమజంట ప్రాణం తీసిన సెల్ఫీ మోజు.. పండుగ రోజున అనంత విషాదం
సెల్ఫీ మోజు ఓ ప్రేమజంట ప్రాణం తీసింది. సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రియురాలు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో ప్రియుడు కూడా కాలువలో కొట్టుకుపోయాడు.
Chitravathi River : అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ మోజు ఓ ప్రేమజంట ప్రాణం తీసింది. తాడిమర్రి మండలం దాడితోట గ్రామంలో చిత్రావతి నదిలో ప్రేమజంట గల్లంతైంది. అయ్యవారిపల్లి గంగమ్మ గుడి దగ్గర సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రియురాలు రామాంజినమ్మ ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో ప్రియుడు అమర్నాథ్ కూడా కాలువలో కొట్టుకుపోయాడు.
బుక్కరాయసముద్రం మండలం కొత్తచెదుల్ల గ్రామానికి పిచ్చికుంట్ల అమర్నాథ్(22), అనంతపురం ప్రకాష్నగర్కు చెందిన రామాంజినమ్మ(20) ప్రేమికులు. అమర్నాథ్ అనంతపురంలో సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. రామాంజినమ్మ ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తుంది. దాడితోట మండలానికి చెందిన పరశురాం అనే యువకుడు అమర్నాథ్ దగ్గర పని చేస్తున్నాడు. పరశురాం సంక్రాంతి పండక్కి దాడితోటలోని తమ బంధువుల ఇంటికి వచ్చాడు. అమర్, రామాంజినమ్మలను కూడా ఆహ్వానించాడు. ముగ్గురు కలిసి మధ్యాహ్నం భోజనం చేశాక చిత్రావతి జలాశయం చూసి, అయ్యవారిపల్లి గంగమ్మ గుడి దగ్గరికి చేరుకున్నారు.
అక్కడ మొబైల్ లో సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఘోరం జరిగిపోయింది. రామాంజినమ్మ ప్రమాదవశాత్తు కాలువలోకి జారిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో అమర్నాథ్ కూడా కాలువలో పడ్డాడు. పరశురాం వారిని గమనించేలోపు కాలువ మధ్యలో లోతుగా ఉన్న గుంతలోకి ఇద్దరూ వెళ్లిపోయారు. జరిగిన విషయాన్ని పరశురాం గ్రామస్తులకు, పోలీసులకు తెలిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గల్లంతైన జంట కోసం ఈతగాళ్లు, ఫైర్ సిబ్బందితో వెతికించారు.
Heart Diseases Risk : గుండె జబ్బులు ఇందుకే వస్తున్నాయట.. షాకింగ్ వాస్తవాలు..!
ముందు అమ్మాయి మృతదేహం లభ్యమైంది. ఆ తర్వాత అబ్బాయి మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను అనంతపురం మార్చురీకి తరలించారు. ఈ ఘటన ఇరువురు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.