‘‘పుర్రె’’ రాజు పక్కనున్న అమ్మాయి ఎవరు?..

  • Published By: sekhar ,Published On : August 17, 2020 / 06:50 PM IST
‘‘పుర్రె’’ రాజు పక్కనున్న అమ్మాయి ఎవరు?..

విశాఖపట్నం రెల్లివీధిలో సైకో రాజు పుర్రెను కాల్చుకుతున్న ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వన్‌టౌన్ పోలీసులకు సమాచారమందించడంతో సంఘటనా స్థలానికి వచ్చి రాజును అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ‘‘ఆదివారం నాన్‌వెజ్’’ అంటూ మనిషి పుర్రె, కాళ్లు తెచ్చి కాల్చుకు తింటుండగా స్థానికులు గుర్తించగా రాజు వారిపై దాడికి పాల్పడడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. అతని ఇంట్లో అస్థిపంజరం కనిపించడంతో స్థానికులు హడలిపోయారు.



రాజుతో పాటు అతని ప్రియురాలిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఇంట్లో వాళ్లకు దూరంగా ఉండడంతో డ్రగ్స్‌కు బానిసైన రాజు తన ప్రియురాలు కళావతితో కలిసి మనిషి మాంసం తినడానికి అలవాటు పడ్డాడు. కళావతితో రాజు సహజీవనం చేస్తున్నాడని వారిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు.
స్మశానంలో కాటికాపరులకు సాయం చేస్తూ రాజు సైకోగా మారాడు. పుర్రెను ఆంధ్రా మెడికల్ కాలేజీలోని అనాటమీ విభాగం నుంచి 14 రోజుల క్రితమే తీసుకొచ్చి ఇంట్లో పూజలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.



తనకు శివుడు అంటే చాలా ఇష్టమని, పుర్రెను పూజిస్తే మంచి జరుగుతుందని ఎవరో చెప్పడంతో ఇలా చేశానని రాజు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. కళావతి తన ప్రియురాలు కాదని, కేవలం స్నేహితురాలు మాత్రమేనని చెప్పుకొచ్చాడు. తాను పుర్రెను కాల్చుకు తినలేదని, తాను మనిషినేనని తనకూ కుటుంబం ఉందని మనిషి మాంసం తినేంత దుర్మార్గుణ్ణి కాదని చెప్పాడు. దీంతో ఇంకోసారి ఇలా చేయవద్దని వారించి స్టేషన్ బెయిల్‌పై రాజుని విడుదల చేశారు పోలీసులు. పోలీసులు రాజుని విడుదల చేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతణ్ణి వదిలేస్తే మరిన్ని పూజలు చేసే అవకాశముందని, అతనికి కౌన్సెలింగ్ ఇవ్వాలంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పుర్రె ఘటనతో విశాఖపట్నం ఉలిక్కి పడింది.