మహా శివరాత్రి .. అసలు శివరాత్రి మహత్యం ఏమిటి..

మహా శివరాత్రి .. అసలు శివరాత్రి మహత్యం ఏమిటి..

significance of mahashivratri 2021 : హరహర మహాదేవ శంభో శంకర.. దుఃఖ హర.. భయ హర.. దారిద్ర హర.. అనారోగ్య హర.. ఐశ్వర్య కర.. ఆనందకర.. అంటూ దేశంలోని శివాలయాలన్నీ హర నామస్మరణతో హోరుమంటాయి. శివరాత్రి వచ్చిందంటే చాలు భక్త జనకోటి శివోహం అంటూ భక్తితో వూగిపోతుంటారు.. ఏమిటా మహాశివరాత్రి మహిమ.

సృష్టి- స్థితి- లయల్లో.. లయకారకుడు శివుడు. అలాగని ఆయన శక్తికి పరిమితి లేదు.. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్న సామెత ఉండనే వుంది. అలా శివుడు సర్వ శక్తి సంపన్నుడై లింగాకారంలో ఆవిర్భవించిన రోజును మహాశివరాత్రి అంటారు. శివుడు విభూతి ప్రియుడు. శివుడికి మరేమీ అక్కర్లేదు.. అంత బూడిద వుంటే చాలు ప్రసన్నం చేసుకోడానికి. అందుకే మహాశివరాత్రి రోజున విభూతి తయారు చేయడం మంచిదని చెబుతుంది.. పండితారాధ్య చరిత్రము.

శివరాత్రి ఏటా మాఘ బహుళ చతుర్ధశి రోజు వస్తుంది. మాఘమాసం అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ నెలలొ ఎంచక్కా ఉదయాన్నే లేచి తలారా స్నానం చేయడం అన్నివిధాలా మంచిది. ముఖ్యంగా శివరాత్రి రోజు వేకువ జామునే లేచి తలారా స్నానం చేసి శివదర్శనం చేసుకుంటే జీవితానికి సరిపడా పుణ్యమొస్తుందని నమ్ముతారాయన భక్తులు. అందుకే జన్మానికో శివరాత్రయినా శివుడి కోసం ఉపవాస దీక్ష చేయాలని చెబుతారు పెద్దలు.

శివరాత్రి రోజున స్నానం ఎంత ముఖ్యమో ఉపవాసం అంత శ్రేష్టమైంది. రోజంతా ఉపవాసం వుండి ఆ మరునాటి ఉదయం భోజనం చేయడం ఒక పద్ధతి. కొందరు శివరాత్రి నాడు పగలంతా ఏం తినకుండా ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత భోంచేయడం ఒక ఆచారం. దీన్నే నక్తం అంటారు. మరికొందరు పగటి పూట ఏదో ఒకటి తిని.. రాత్రి ఉపవాసం ఉంటారు. దీన్ని ఏక భుక్తం అంటారు.

అసలు శివరాత్రి మహత్యమంతా రాత్రి వేళల్లోనే వుంటుంది. అందుకే భక్తజనులందరూ ఈ రాత్రి పూట భజనలు- పురాణ కాలక్షేపం- లేదంటే శివనామస్మరణతో గడుపుతారు. కొందరు వీలున్న వారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు, అర్చనలు చేయించి శివకృపా కటాక్షాలను పొందుతారు.

ఇంతకీ శివరాత్రి అంటే ఏమిటి? అని ప్రశ్నించుకుంటే శివుడు ఆరుద్ర నక్షత్రంలో లింగాకారంలో ఆవిర్భవించిన కాలంగా చెబుతారు. శివుడు లింగాకారంలో ఎందుకు ఆవిర్భవించాడు అంటే.. అందుకు బ్రహ్మ- విష్ణువుల మధ్య వచ్చిన తగవు కారణంగా వివరిస్తుంది శివపురాణం. శివుని ఆవిర్భావం గురించి పలు కధలు ప్రాచుర్యంలో ఉన్నాయి. బ్రహ్మ – విష్ణువుల మధ్య వచ్చిన ఆధిపత్య సమస్యను తీర్చడంలో భాగంగా శివుడు అగ్ని స్థంభంగా ఆవిర్భవిస్తాడట. దాని ఆది- అంతములు ఎవరు కనుగొంటారో వారే గొప్పవారని అంటాడట.

అగ్ని స్థంబం మొదలు చూడ్డానికి బ్రహ్మ.. అంతం చూడ్డానికి విష్ణువు బయలు దేరుతారు. అంతం కనుగొన లేక పోయిన విష్ణువు వెనుదిరగగా.. దారి మధ్యలో కనిపించిన కామథేనువు, మొగలిపువ్వును చూసి.. బ్రహ్మ తాను మొదలు కనుక్కున్నాని అంటాడట. కానీ అది నిజం కాదు. తన ఓటమి ఒప్పుకున్న విష్ణువుకు తనతో సమానమైన పూజలందుతాయని వరమిస్తాడట శివుడు.

అలాగే బ్రహ్మ అబద్ధం చెప్పడానికి ఉపయోగపడిన మొగలి పూవు పూజార్హం కానిదని, కామథేనువు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పినందువల్ల గోవు వెనుక భాగం పూజనీయం అవుతుందని వరమిస్తాడు పరమేశ్వరుడు. అంతే కాదు అబద్ధం చెప్పిన బ్రహ్మ ముఖాన్ని కత్తిరిస్తాడు. ఇలా శివ లింగం ఆవిర్భవించడం వెనుక ఇంత కథ దాగి వుంది. అందుకే మహా శివరాత్రికి ఎంతో విలువనిస్తారు హైందవులు.

మహా శివరాత్రి రోజున తమిళనాడులోని అరుణాచలేశ్వరం దర్శిస్తే మంచిదని చెబుతారు. ఎందుకంటే శివుడు అగ్ని స్తంభంగా ఆవిర్భవించింది ఇక్కడే అని చెబుతుంది శివపురాణం. లింగోద్భవ సమయంలో బ్రహ్మ- విష్ణువులు తనను అర్చించి మెప్పించడంతో ప్రసన్నుడవుతాడు శివుడు. శివరాత్రి రోజున తనను ఇలా అర్చించిన వారికి అష్టైశ్వర్యములు కలుగుతాయని సెలవిస్తాడట పరమేశ్వరుడు. అందుకే భక్త కోటి శివరాత్రి నాడు ఎక్కడ ఏ లింగమున్నా వదలక పూజించడం ఒక ఆనవాయితీగా మారింది.

శివరాత్రి నాడు శివలింగానికి రుద్రాభిషేకం చేయించడం మంచిది. అంతే కాదు జాగారం వుండి శివ పంచాక్షరి మంత్రంతో ధ్యానం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారాయన భక్తులు. కనుకనే మహాశివరాత్రి నాడు నమశ్శివాయ అంటూ మారుమోగుతాయి శివాలయాలన్నీ.

త్రయంబకం యజామహే…. అంటూ శివ మృత్యుంజయ మంత్రం జపిస్తే సకల రోగబాధలూ తగ్గి పూర్ణాయుష్షు లభిస్తుందని చెబుతారు. ఇలా శివరాత్రి రోజున శివుడికి సంబంధించిన స్నాన- ఉపవాస- అభిషేక- అర్చనలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతుంది శివపురాణం.