వదినతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని యువకుడి హత్య
తన వదినతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో స్నేహితుడిని ఇంటికి పిలిచి హత్యచేసిన ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మర్రి పల్లి గ్రామంలో జరిగింది.
మర్రిపల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి కృష్ణయ్య కుమారుడు ఈర్లపల్లి కిరణ్ (28) ప్రైవేటు డ్రైవర్గా పనిచేసుకుంటూ బతుకున్నాడు. గురువారం రాత్రి అదే గ్రామానికి చెందిçన కిరణ్ స్నేహితుడైన ఏదుల మహేష్.. కిరణ్ కు ఫోన్ చేసి తన ఇంటికి రమ్మన్నాడు. కిరణ్ అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో మహేష్ ఇంటికి వెళ్లాడు.
అక్కడ మహేష్ తన వదినతో కిరణ్ కు ఉన్న వివాహేతర సంబంధం విషయ.మై నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మహేష్ అన్న శ్రీశైలం, వదిన రమాదేవి తో పాటు మరి కొంత మంది కుటుంబ సభ్యులు కలిసి కిరణ్ ను గొడ్డలితో తలపై కొట్టటంతో అక్కడి కక్కడే మృతి చెందాడు. విషయంతెలుసుకున్న కిరణ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పథకం ప్రకారమే మహేష్ కుటుంబ సభ్యులు తన కుమారుడిని ఇంటికి పిలిపించుకుని కొట్టి చంపారని కిరణ్ తండ్రి ఆరోపించాడు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టు మార్టానికి తరలించబోయారు.
ఈలోగా కిరణ్ కుటుంబ సభ్యులు, మర్రిపల్లి గ్రామంతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హత్య జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు.ఏసీపీ వచ్చి తమకు న్యాయం చేయాలని ..అంతవరకు మృతదేహాన్ని కదలనివ్వమని నిరసన తెలిపారు. ఎసీపీ సురేందర్, సీఐ నర్సిహ్మారెడ్డి మర్రిపల్లి గ్రామానికి చేరుకుని కిరణ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని తరలించడానికి ఒప్పుకున్నారు.
క్లూస్టీం సభ్యులు హత్య జరిగిన ప్రదేశం నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. కిరణ్ హత్యకు మహేష్, శ్రీశైలం, రమాదేవి, కళమ్మ, లాలయ్య, సురేష్, మాసని రాజు కారణమని, విచారణ జరిపి న్యాయం చేయాలని కిరణ్ తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు.